Nalgonda: అక్రమంగా తరలిస్తున్న 117 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్.. 20 లక్షల గంజాయి స్వాధీనం

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకొని వారి నుండి 117.35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా ఎస్ పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా అశోక్ విహార్ […]

Nalgonda: అక్రమంగా తరలిస్తున్న 117 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్.. 20 లక్షల గంజాయి స్వాధీనం

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకొని వారి నుండి 117.35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా ఎస్ పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా అశోక్ విహార్ కు చెందిన సల్మాన్ అలియాస్ సల్మాన్ మాలిక్, అరుణ్ లారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వారికి ఆ వృత్తిలో వచ్చే ఆదాయం ఖర్చులకు, విలాసాలకు సరిపోవడం లేదు. దీనితో ఏదైనా అక్రమ వ్యాపారం చేసి భారీగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు చేపల లోడ్ కోసం ఏపీలోని రాజమండ్రీకి వెళ్ళినప్పుడు అక్కడ గంజాయి వ్యాపారం చేసే చిరంజీవితో పరిచయమే ఏర్పడి, తమ పరిస్థితి తెలిపారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ వెళ్లిన వారిని చిరంజీవి పని వుందని చెప్పి గత నెల 28న రాజమండ్రీకి రప్పించాడు. నాలుగు రోజుల తరువాత అతడు వారికి 65 గంజాయి ప్యాకెట్లతో నింపిన ఇండికా కారును అప్పగించి దీనిని మహారాష్ట్రలో తాను చెప్పిన చోట డెలివరీ ఇవ్వాలని వారికి సూచించాడు.

ఇందుకు గాను వారికి 6వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి, కారు అప్పగించిన తరువాత మరో 12 వేలు ఇస్తారని, కారు తాను చెప్పిన చోట వదిలి వెళ్ళాలని తెలిపాడు. దీనితో వారు ఇరువురు కారులో మహా రాష్ట్ర కు బయలు దేరారు. మధ్యలో పోలీసులను తప్పించుకుంటూ సాయంత్రానికి రామాపురం క్రాస్ రోడ్ లోని చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. కానీ అక్కడ పోలీసు తనిఖీలు ఎక్కువగా ఉండడంతో కారును పక్కన నిలిపివుంచి అవకాశం కోసం చూసారు. కానీ వీలు కాకపోవడంతో చివరకు కారును వదిలి పెట్టి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ కారును గమనిస్తున్న పోలీసులు వారు పారిపోతుండగా వెంటపడి పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా గంజాయి అక్రమ రవాణా విషయం బయటపడింది. దీనితో తహశీల్దార్ సమక్షంలో గంజాయినీ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు లో 3వ నిందితుడిగా వున్న చిరంజీవి పరారీలో ఉన్నారని, కేసు ను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ పీ తెలిపారు. కోదాడ డీ ఎస్ పీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించి గంజాయి తరలింపును అడ్డుకున్న కోదాడ రూరల్ సీ ఐ నాగ దుర్గా ప్రసాద్, ఎస్ ఐ సాయి ప్రశాంత్, సిబ్బందిని ఎస్ పీ అభినందించారు. సమావేశంలో డీ ఎస్ పీ వెంకటేశ్వర రెడ్డి, కోదాడ రూరల్, టౌన్ సీ ఐ లు ప్రసాద్, శివ శంకర్, పలువురు ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.