సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణ శాఖ భూములను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది
విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణ శాఖ భూములను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఈ భూముల బదిలీతో కంటోన్మెంట్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు, ఒకటో నెంబర్, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్లు, వంతెనలు, స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రక్షణ శాఖ 175ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయడం పట్ల కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అటు సీఎం రేవంత్రెడ్డి కూడా తమ లేఖకు స్పందించి రక్షణ శాఖ భూములు బదిలీ చేసినందుకు ప్రధాని మోడీకి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు. భూముల బదలాయింపుతో సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా రామగుండం, నాగ్పూర్ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి.