అదానీ సంచలన నిర్ణయం.. FPO రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన..!
Adani Enterprises | హిడెన్బర్గ్ నివేదిక అనంతరం స్టాక్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. పెట్టుబడిదారులకు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు అదానీ కంపెనీ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్పీవో సందర్భంగా సంస్థపై నమ్మకం ఉంచి, అండగా పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం ఎఫ్పీఓ సబ్స్క్రిప్షన్ విజయవంతమైందని, […]

Adani Enterprises | హిడెన్బర్గ్ నివేదిక అనంతరం స్టాక్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. పెట్టుబడిదారులకు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు అదానీ కంపెనీ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్పీవో సందర్భంగా సంస్థపై నమ్మకం ఉంచి, అండగా పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం ఎఫ్పీఓ సబ్స్క్రిప్షన్ విజయవంతమైందని, గత వారం రోజులుగా షేర్లలో అస్థిరత నెలకొన్నప్పటికీ సంస్థ వ్యాపార నిర్వహణపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపింది.
క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్పీఓతో ముందు సాగకూడదని అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు నిర్ణయించిందని పేర్కొంది. ప్రస్తుతం అదానీ ఎంటర్ప్రైజెస్కు బలమైన బ్యాలెన్స్ షీట్, సురక్షితమై ఆస్తులు ఉన్నాయని చెప్పింది. అదే సమయంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సంస్థకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పుకొచ్చింది. ఎఫ్పీఓతో ముందుకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం సంస్థపై, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
మార్కెట్లు స్థిరపడిన తర్వాత క్యాపిటల్ మార్కెట్ వ్యూహాలను సమీక్షించుకుంటామని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత వారం హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. ఒక్కరోజే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించనివిధంగా ఎఫ్పీవో రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఎఫ్పీవో మొదలైన నాటి నుంచి గ్రూప్నకు వాటిల్లిన నష్టం రూ.7.35 లక్షల కోట్లు. హిండెన్బర్గ్ రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో అదానీ సంస్థల షేర్లన్నీ కుప్పకూలిన ఫలితంగా గ్రూప్ మార్కెట్ విలువ పతనం కాగా.. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలోనూ గౌతమ్ అదానీ టాప్-10 స్థానం గల్లంతైన పరిస్థితి.