విధాత: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు మూసీ నది నుండి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు మోత్కూరు-నార్కట్ పల్లి రోడ్డుపై ఎండ్ల బండ్లు అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు.
ఇసుక రవాణాతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, స్థానిక యువత అక్రమ ఇసుక రవాణాలో భాగస్వామమై మద్యానికి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, రోడ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అక్రమ ఇసుక రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు గంటలపాటు రైతులు రాస్తారోకో నిర్వహించడంతో మోత్కూరు – నార్కట్ పల్లి మార్గంలో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి.