పూర్తిస్థాయి మొదటి బ్రెయిన్ స్కేల్ సూపర్ కంప్యూటర్ (Human Brain Super Computer) ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రేలియా (Australia) పరిశోధకులు ప్రకటించారు
విధాత: పూర్తిస్థాయి మొదటి బ్రెయిన్ స్కేల్ సూపర్ కంప్యూటర్ (Human Brain Super Computer) ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రేలియా (Australia) పరిశోధకులు ప్రకటించారు. ఇది వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని తెలిపారు. న్యూ సైంటిస్ట్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఈ సూపర్ కంప్యూటర్కు పరిశోధకులు డీప్సౌత్ అనే పేరును పెట్టారు. ఈ డీప్ సౌత్ కంప్యూటర్ను ఇంటర్నేషన్ సెంటర్ న్యూమార్ఫిక్ సిస్టమ్స్ (ఐసీఎన్ఎస్) నిర్మిస్తోంది. దీని రూపకల్పనలో ఇంటెల్ (Intel) , డెల్ (Dell) వంటి బడా సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. దీని నిర్మాణం ప్రస్తుతం వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లు, సాధారణ కంప్యూటర్లకు భిన్నంగా డీప్సౌత్ న్యూరాల్ నెట్వర్క్స్ను ఆధారం చేసుకుని పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. డీప్సౌత్ వంటి సూపర్ కంప్యూటర్లను ఇది వరకే రూపొందించినప్పటికీ.. ఇది చాలా పెద్దదని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినదని ఓ నివేదిక వెల్లడించింది. ఇది ఒక సెకనుకు రెండు కోట్ల 28 లక్షల కోట్ల (228 ట్రిలియన్ ) గణనలను ఇది చేయగలదని రూపకర్తలు చెబుతున్నారు. ఈ సామర్థ్యం సుమారుగా మనిషి మెదడుకు దగ్గరగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఏమిటీ డీప్సౌత్ వల్ల ఉపయోగం?
భారీ స్థాయి సూపర్కంప్యూటర్ల సామర్థ్యం డీప్సౌత్కు లేకపోవచ్చునని.. అయితే మనిషి మెదడును పరిశోధించాలని అనుకునే వారికి ఎవరికైనా ఇది అత్యున్నత మార్గమని ప్రాజెక్ట్ లీడర్ ఆండ్రే వాన్ స్చాయిక్ అన్నారు. న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్, బయాలజికల్ బ్రెయిన్స్ వంటి అంశానలు లోతుగా విశ్లేషించడానికి డీప్ సౌత్ అక్కరకు వస్తుందని పేర్కొన్నారు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అనే విషయాలను మనం డీప్ సౌత్ వల్ల బాగా అర్థం చేసుకుంటాం అని ఆండ్రే వెల్లడించారు.
అంతే కాకుండా ఇప్పుడు ఉన్న వాటి కంటే భిన్నంగా డీప్సౌత్ సూపర్ కంప్యూటర్ తక్కువ విద్యుత్ను ఉపయోగించుకుని పని చేస్తుందని దీనిని రూపొందిస్తున్న వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ వెల్లడించింది. దీనికి కావాలంటే మనం అదనపు హార్డ్వేర్ను జోడించుకోవచ్చని.. లేదంటే వాటిని తీసేసి సింపుల్గానూ ఉపయోగించవచ్చని తెలిపింది. మానవ మెదడును అనుసరించడం, అనుకరించడం ద్వారా డీప్ సౌత్ .. కృత్రిమ మేధలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని దీని రూపకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.