Bhuvanagiri | తెలంగాణ ప్రగతి అంటే 5 లక్షల కోట్ల అప్పేనా? నయీమ్ డైరీ.. ఆస్తులు ఏమయ్యాయి..?: భట్టి
Bhuvanagiri విధాత: గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంకా డైరీని బయట పెట్టకుండా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 49వ రోజు గురువారం భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో వేల కోట్ల రూపాయల నోట్లు, భూములు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు దొరికినట్లు మీడియాలో ఐదారునెలపాటు కథనాలు వచ్చాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు […]

Bhuvanagiri
విధాత: గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంకా డైరీని బయట పెట్టకుండా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 49వ రోజు గురువారం భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో వేల కోట్ల రూపాయల నోట్లు, భూములు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు దొరికినట్లు మీడియాలో ఐదారునెలపాటు కథనాలు వచ్చాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. నయీం అక్రమంగా సంపాదించిన భూములన్ని ఇప్పుడు ఎవరి పాలు అయినాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నయీమ్ ఆస్తుల విషయాన్ని గోప్యంగా దాచిపెడుతూ దాటవేసే ధోరణి అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎన్ కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంకు పెద్ద తేడా ఏమున్నదని విమర్శించారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రికవరీ చేసిన ఆస్తులన్నిటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును చంపివేసి కాలేశ్వరం డిజైన్ చేసి అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీలు కట్టి ఇప్పటి వరకు కేవలం 110 టీఎంసీలు మాత్రమే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోశారని తెలిపారు.
కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి దిగువకు 1500 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయని వివరించారు. రూ. 1.25 లక్షలు ఖర్చు చేసి కట్టిన కాలేశ్వరం ద్వారా ఒక ఎకరాన్ని కూడా ఆదనంగా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఆదిలాబాద్ నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేసిన గ్రామాల్లో ప్రజలు సరైన ఇండ్లు లేక, కొలువులు రాక, ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూములపై హక్కులు కోల్పోయి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ప్రగతి భవన్, సెక్రటేరియట్ కట్టి తెలంగాణ వెలిగిపోతుందని అనడం విడ్డూరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం వెలిగిపోవట్లేదని సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ సంపదను దోపిడీ చేసి దేశంలో విపక్ష అభ్యర్థుల ఎన్నికలకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పేంత వెలిగిపోతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 లక్షలు ఉన్న నిరుద్యోగ సమస్య 30 లక్షలకు పెరిగిందని, రాష్ట్రంలో ఇంత పెద్దగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే తెలంగాణ ఎట్లా వెలిగినట్టు అవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లక్ష్యాలు నెరవేరలేదు కానీ రాష్ట్ర ప్రజలకు ఐదు లక్షల కోట్ల అప్పు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి సమాజం, అనేక చట్టాల ద్వారా భూములపై పొందిన హక్కులు ధరణి ద్వారా కోల్పోవడం బిఆర్ఎస్ పరిపాలనలో జరిగిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, కాంతాలపల్లి, పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గీత, నేత, యాదవ బలహీనవర్గాలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చి జనాభా తమాషా ప్రకారంగా నిధులను కేటాయిస్తామని ప్రకటించారు.
ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరణ చేసి రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు అన్నిటిని పేదలకు పంచుతామని వెల్లడించారు. ధరణి వల్ల భూముల పైన హక్కులు కోల్పోయిన వారికి తిరిగి ఆ హక్కులు తీసుకురావడానికి పాత రెవెన్యూ రికార్డులో ఉన్న అన్ని కాలమ్స్ ను తిరిగి తీసుకువస్తామని చెప్పారు.