విధాత: పార్లమెంటులో గురువారం చంద్రయాన్-3 విజయం పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూడీ బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. దీన్ని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలన్నీతీవ్రంగా ఖండించాయి. తమ ఎంపీ ప్రవర్తన తీరుపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేయగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించి ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బిధూడీ వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్గా ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీజేపీ నేతలు ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ టీవీ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనిపై ముస్లిం దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. అలాంటి వివాదాస్పద ట్వీట్స్ చేసిన ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ను బహిష్కరించింది. బీజేపీ నేతల తీరు వల్ల అంతర్జాతీయంగా దేశం తలదించుకోవాల్సి వచ్చింది.
రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధాని సహా ఆపార్టీ నేతలంతా ఎన్నికల ప్రచార సమయంలో హిందు-ముస్లిం ల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఆ పార్టీ జాతీయ నేతల వ్యవహారశైలి వల్లనే ఇతర పార్టీ శ్రేణులు కూడా వారినే అనుసరిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో మోడీ, షాలు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ పార్టీ ఉద్దేశం ఏమిటో అర్థమౌతుంది. మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్నరిజర్వేషన్ల పోరులో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఆ రాష్ట్ర సీఎం ఒక వర్గానికి మద్దతు పలకడం చర్చనీయాంశం అయ్యింది.
అంతేకాదు సుప్రీంకోర్టు కూడా అక్కడ శాంతి స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ నేతలు, ఆపార్టీ నేతలు అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తున్నా కేంద్రం వారిని వారించలేదు. తాజాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల పీఠికలో సమాఖ్య, సామ్యవాద పదాలు మాయమయ్యాయి. దీన్నిబట్టి ఇదంతా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని విపక్షపార్టీలు, ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, అచ్ఛేదిన్ అన్నవి బీజేపీ నినాదాలు మాత్రమేనని, విద్వేష రాజకీయాలే ఆపార్టీ విధానమని ఈ తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అనేక సంఘటలే కాకుండా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూడీ బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీపై చేసిన వ్యాఖ్యలు దానికి ఉదాహరణ అని విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగ పీఠిక ప్రతుల్లో సమాఖ్య, సామ్యవాద పదాలు లేకపోవడం ఇందులో ప్రభుత్వ ఉద్దేశం అనుమానాస్పదంగా ఉన్నది, రాజ్యాంగంపై ఇది దాడిగా అభివర్ణించాయి. ఈ విద్వేష రాజకీయాలతో వికాసం ఎట్లా సాధ్యమో బీజేపీ నేతలే చెప్పాలంటున్నారు.