Heart Attack | పంటి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యాపారవేత్త.. చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. వెయిటింగ్ హాల్లో కూర్చున్న ఆ వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతుండగా, గుండెపోటుకు గురయ్యాడు. క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని సూరత్కు చెందిన బట్టల వ్యాపారి దిలీప్ కుమార్(61).. ఓ సామాజిక కార్యక్రమం నిమిత్తం ఇటీవలే బార్మర్కు వెళ్లాడు. అయితే ఆయనకు పంటి నొప్పి తీవ్రంగా ఉండటంతో శనివారం ఉదయం 10 గంటల సమయంలో డెంటిస్ట్ వద్దకు వెళ్లాడు.
అప్పటికే డాక్టర్ బిజీగా ఉండటంతో.. వెయిటింగ్ హాల్లో కూర్చొని పేపర్ చదవడం మొదలు పెట్టాడు. ఏదో ఇబ్బందిగా ఉండటంతో.. పేపర్ను పక్కన పెట్టేశాడు. ఇక క్షణాల్లోనే కుప్పకూలి నేలపై పడిపోయాడు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది దిలీప్ కుమార్ను సమీప ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని దిలీప్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. దిలీప్ కుమార్ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.