విధాత: టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశాన్నిఈ నెల 27వ తేదీన నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ చేస్తున్నసోదాలపై మంత్రి తలసాని స్పందించారు. ఈ దాడులు ముందే ఊహించామని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు.
ఈ రోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు.. రేపు మా చేతిలో ఉండొచ్చు. కాబట్టి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలి. దేశ చరిత్రలో ఇలాంటి విధానాలు ఎప్పుడూ చూడలేదన్నారు.
టీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న దాడులకు మా నాయకత్వం భయపడదని, జరుగుతున్న పరిణామాల్ని ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలను చైతన్యం చేసి మేము ఏమిటనేది చూపిస్తామని చెప్పారు. భయపడే వాళ్లమే అయితే హైదరాబాద్లో ఎందుకు ఉంటామని అన్నారు. తొందరెందుకు ఏం జరుగుతుందో భవిష్యత్తులో ప్రజలే చూస్తారని తెలిపారు.