CM KCR 80వేల కోట్లు ఎప్పుడో తీర్చేశామన్న కేసీఆర్ చెల్లింపులు ఇప్పుడే మొదలయ్యాయన్న కేంద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై గందరగోళం విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన 80 వేల కోట్ల అప్పు ఎప్పుడో తీరిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఎన్నికల ముందు కొత్త చర్చకు తెరలేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆరెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా […]
CM KCR
విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన 80 వేల కోట్ల అప్పు ఎప్పుడో తీరిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఎన్నికల ముందు కొత్త చర్చకు తెరలేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆరెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఏకవాక్యంలో తేల్చేశారు.
అయితే అప్పు ఎలా తీరింది? ఎప్పుడు తీర్చారు? అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్ తన వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. రాష్ట్రంలో ఇసుక పండినట్లే ధాన్యం పండుతున్నదని, రోడ్లన్నీ ధాన్యం రాశులతో నిండిపోతున్నాయని చెప్పారు. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా ఆలేరు, భువనగిరి వజ్రపు తునకలవుతాయని, కరువు శాశ్వతంగా పోయినట్లేనని చెప్పిన సీఎం.. ఇక మనం బతికుండగా అక్కడ కరువు చూడలేమంటూ తనదైన శైలిలో వాగ్ధాటి చూపారు. ఇదెలా ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం వద్ద, రుణసంస్థల వద్ద చేసిన అప్పు ఎప్పుడు? ఎలా తీరిందన్న అంశం ఇప్పుడు బేతాళ ప్రశ్నగా అందరి మదిని తొలచి వేస్తున్నది.
కాళేశ్వరం అప్పు తీరిందని సీఎం కేసీఆర్ చెప్పిన రోజునే పార్లమెంటులో ఆయన పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఆసక్తికర సమాధానం చెప్ప్రు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అప్పుల చెల్లింపు ఇప్పుడే మొదలైందని ఆమె పేర్కొనడం గమనార్హ్. అప్పుల్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ టాప్లో ఉన్నదని పార్లమెంట్కు లెక్కలు వెల్లడించారు.
2019లో 1,90,203 కోట్లుగా ఉన్న అప్పు 2023 -24 మార్చి నాటికి 3లక్షల 66వేల 306కోట్లకు చేరుకుందని తెలిపారు. ఈ అప్పుల లెక్కలు కూడా రాష్ట్ర జీఎస్డీపీ మేరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలవే. వాటికి కేంద్ర కార్పొరేషన్లు, వాణిజ్య బ్యాంకులు విద్యుత్తు సంస్థల గ్యారెంటీలు అదనం. అవన్నీ 5.5 లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. ప్రతి ఏటా వడ్డీ కోసం 22 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది.
ఇందులో కాళేశ్వరం, మిషన్ భగీరథ అప్పులకు 12,000 కోట్ల చెల్లింపు మొదలైనట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే దీనికి భిన్నంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉండటం విశేషం. దీంతో సీఎం చెప్పింది నిజమా? లేక కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పింది నిజమా? అనే చర్చ మొదలైంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించక మరో లక్ష కోట్ల అప్పుల కోసం, భూముల అమ్మకం కోసం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అప్పులు ఎప్పుడు.. ఎలా చెల్లించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాళేశ్వరం అప్పు 80 వేల కోట్లు కేసీఆర్ చెప్పినట్టు తీరిందా? లేదా? అన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం అప్పు ఎంత అన్నది మరో ప్రశ్న. కాగ్ నివేదిక మేరకు కాళేశ్వరం డీపీఆర్ ప్రకారం నిర్మాణ వ్యయం రూ.81,911 కోట్లుగా ఉంది. కాగ్ ప్రస్తుత అంచనా లెక్కల మేరకు 1 లక్ష 49,317.22 కోట్లుగా ఉంది. తాజా నిర్మాణ వ్యయ లెక్కల మేరకు ప్రతి ఎకరాకు ఐదు లక్షలు పెట్టబడి వ్యయంగా ఉన్నది.
విద్యుత్తు చార్జీలకు రూ.10,374 కోట్లు అవసరం. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ అదనం. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కాగ్ ఎకరాకు నిర్వహణ ఖర్చు 46,364గా తేల్చింది. 1 రూపాయి ఖర్చుకు 52 పైసల ప్రయోజనమే అవుతుందని పేర్కొంది.
ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ, లాభాల లెక్కలు పక్కన పెడితే సీఎం కేసీఆర్ తాజాగా చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడు తీరిపోయిందోనన్న ప్రశ్న ప్రతిపక్షాల బుర్రలను, ప్రజలను తొలిచేస్తున్నది. కాగా కేసీఅర్ అన్నట్టు తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ కాకపోయినా రాష్ట్ర తలసరి ఆదాయం దక్షిణాన తాజా ధరల మేరకు మొదటి స్థానంలో, స్థిర ధరల మేరకు మూడో స్థానంలో ఉండటం కొంత ఊరటనిచ్చేది