హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల హామీలతో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్కో గ్యారెంటీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలను అమలు చేయగా, తాజాగా మరో రెండు పథకాలను సీఎం రేవంత్ సర్కార్ ప్రారంభించింది. సచివాలయం వేదికగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించింది. ఈ రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే గ్యాస్ సిలిండర్ను అందించనున్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయనున్నారు. ఇక రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ. 80 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ణయిస్తారనేది చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హతలను పేర్కొంటూ జీవో జారీ చేసింది.
మరి అర్హులు ఎవరు..?
- మహాలక్ష్మి పథకం కోసం ప్రజాపాలన అప్లికేషన్లో దరఖాస్తు చేసుకుని ఉండాలి.
- అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం ద్వారా రూ.500 కే గ్యాస్ సిలిండర్ను అందించనుంది ప్రభుత్వం.
- గ్యాస్ కనెక్షన్ మహిళ పేరుమీద ఉండాలనే నిబంధన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
- ఇక గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని వర్తింప జేయనున్నారు అధికారులు. ఇక సబ్సిడీ గ్యాస్ పేమెంట్ను ఆయా గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం ప్రతి నెలా చెల్లింపులు చేయనున్నట్లు గైడ్లైన్స్లో పేర్కొంది.