ఏడుపాయల జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా..

అధిక సంఖ్యలో త‌ర‌లిరానున్న భ‌క్తులు.. ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు విధాత, మెదక్ బ్యూరో: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఏడుపాయల జాతర సమీపిస్తునందున ఏర్పాట్లను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవెందర్‌రెడ్డితో కలిసి ఏడుపాయలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. గుడి ప్రాంగణం పరిశీలించి, పరమశివుని విగ్రహ ఏర్పాటుకు బండరాళ్ళపై వేసే […]

ఏడుపాయల జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా..
  • అధిక సంఖ్యలో త‌ర‌లిరానున్న భ‌క్తులు..
  • ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

విధాత, మెదక్ బ్యూరో: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఏడుపాయల జాతర సమీపిస్తునందున ఏర్పాట్లను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవెందర్‌రెడ్డితో కలిసి ఏడుపాయలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు.

గుడి ప్రాంగణం పరిశీలించి, పరమశివుని విగ్రహ ఏర్పాటుకు బండరాళ్ళపై వేసే స్టేజి పటిష్టంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు ఆదేశాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచనల మేరకు ఏర్పాట్ల‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

మహాశివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ఏడుపాయల జాతరకు జిల్లా నలుమూలల నుంచే గాక పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భ‌క్తులు వ‌స్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు, అసౌక‌ర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం స‌మ‌ర్థ‌వంతంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

17 నుంచే భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించిన‌ట్టు పేర్కొన్నారు. అధికారులకు రోజు వారీగా, షిప్ట్‌ల‌ వారీగా విధులు కేటాయించామని పార్కింగ్ స్థలాలు, స్నానమాచరించి షవర్లు, బాటింగ్ ఘాట్ల దగ్గర అప్రమత్తంగా ఉంటూ భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటారని అన్నారు.

అదేవిధంగా వీఐపీల రాక, భక్తుల దర్శనం క్యూ లైన్, ప్రసాదం క్యూ లైన్, చెప్పుల స్టాండ్ త‌దిత‌ర ప్రాంతాలలో పోలీస్ శాఖ సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసినదిగా మెదక్ ఆర్డీఓను ఆదేశించిన‌ట్టు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు కృషి చేసి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

జిల్లా కలెక్టర్ వెంట సీఈఓ శైలేష్, ఆర్డీఓ సాయి రామ్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, డిఎస్పీ సైదులు, ఆలయ ఈఓ సార శ్రీనివాస్, చైర్మన్ బాలా గౌడ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు రజిని, సర్పంచ్ సంజీవ రెడ్డి ఆలయ ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.