Congress | భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ బలోపేతం: రంజిత రంజన్ యాదవ్
Congress ఏఐసీసీ సెక్రెటరీ, చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యురాలు రంజిత రంజన్ యాదవ్ విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి, పూర్వవైభవానికి దోహదం చేస్తుందని రాజ్యసభ సభ్యురాలు చత్తీస్గడ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ రంజిత రంజన్ యాదవ్ అన్నారు. భట్టి పాదయాత్ర దేవరకొండ కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడుతు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాథ్ సే హాథ్ జోడో సందేశాన్ని తెలంగాణలో ఇంటింటికి […]

Congress
- ఏఐసీసీ సెక్రెటరీ, చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యురాలు రంజిత రంజన్ యాదవ్
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి, పూర్వవైభవానికి దోహదం చేస్తుందని రాజ్యసభ సభ్యురాలు చత్తీస్గడ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ రంజిత రంజన్ యాదవ్ అన్నారు. భట్టి పాదయాత్ర దేవరకొండ కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడుతు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాథ్ సే హాథ్ జోడో సందేశాన్ని తెలంగాణలో ఇంటింటికి తీసుకు వెళ్లడానికి మండుటెండను సైతం లెక్కచేయకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన శుభ సందర్భంగా ప్రత్యేక అభినందనలన్నారు.
పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలను భట్టి విక్రమార్క తెలుసు కుంటున్నారన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగానే తెలంగాణలో భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీ పూర్వవైభవానికి దోహదపడుతుందన్నారు.
బీఆర్ఎస్ పై పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరుతో భట్టి విక్రమార్క పోరాటం చేస్తున్నారన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు అఖండ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించారన్నారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదు దొందు దొందేనన్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని పారద్రోలుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని గ్రహించిన ప్రజలు ఆ రెండు పార్టీలను ఓడించడానికి సిద్ధమయ్యారన్నారు .
కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయగా, దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ నిరుద్యోగులను దగా చేశారన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. బేటి బచావో బేటి పడావో అంటూ అందమైన నినాదాలు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 9 సరుకులు పంపిణీ చేయగా కేసీఆర్ ప్రభుత్వం బియ్యం మాత్రమే ఇస్తూ గొప్పలు చెబుతున్నదన్నారు. 3000 నిరుద్యోగ భృతి ఇస్తానని బిఆర్ఎస్ ప్రభుత్వం యివ్వలేదని, కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నదన్నారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రతి అంశాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. కర్ణాటకలో ప్రకటించిన వాగ్దానాలన్నిటిని తొలి క్యాబినెట్ లోనే ఆమోదం చేసి అమలు చేస్తున్నామన్నరు. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకు ఇచ్చినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1250 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామన్నారు.
చతిస్గడ్ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను ఎంఎస్పీకి మించి అదనంగా డబ్బులు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని నెలల్లో అధికారంలోకి వస్తుందని, ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తుందన్నారు.
ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.
భట్టి పాదయాత్ర దేవరకొండ సభకు ఏఐసీసీ సెక్రెటరీ శ్రీధర్ బాబు, నల్లగొండ పార్లమెంటు సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి, మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎన్. బాలు నాయక్ తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు.