Jagga Reddy | బీఆర్ఎస్ లోకి రాకుండా మంత్రి హరీష్ స్కెచ్ సక్సెస్.. సంగారెడ్డిలో వీరిద్దరి మధ్యే పోటీ రసవత్తరంగా రాజకీయం విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎట్టకేలకు హరీష్ రావు పంతం నెగ్గింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంట కాగిన విషయం తెలిసిందే. ఆపార్టీలో చేరిక దాదాపు ఖరారైందని ప్రచారం సాగింది. ఇంత జరిగినా నిన్నటి వరకు మౌనం వహించిన జగ్గారెడ్డి, పీసీసీ […]
Jagga Reddy |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎట్టకేలకు హరీష్ రావు పంతం నెగ్గింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంట కాగిన విషయం తెలిసిందే. ఆపార్టీలో చేరిక దాదాపు ఖరారైందని ప్రచారం సాగింది.
ఇంత జరిగినా నిన్నటి వరకు మౌనం వహించిన జగ్గారెడ్డి, పీసీసీ మీడియా పాయింట్ వేదికగా ఖండించారు. నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర కాలంగా గాంధీ భవన్ వైపు చూడని జగ్గారెడ్డి, అకస్మాత్తుగా మెదక్ లో జరిగే సీఎం కేసీఆర్ సభకు మూడు రోజుల ముందు, పార్టీ మారనని, ఇదంతా సోషల్ మీడియా ప్రచారమని కొట్టి పడేయడం వెనుక చాలా తతంగం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సరిగ్గా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ కు ఒక్కరోజు ముందు..
జగ్గారెడ్డి ప్రెస్ మీట్ కు ఒక్కరోజు ముందు… సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఐదు వేల మందికి పైగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ను ఆశ్రయించారు. మంత్రి హరీష్ రావు నివాసానికి తరలి వెళ్ళి, జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవద్దని గట్టిగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇదంతా జగ్గారెడ్డిని పార్టీలో రాకుండా స్వయంగా మంత్రి హరీష్ రావు స్కెచ్ అని అంటున్నారు.
బీఆర్ఎస్..టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ కార్యకర్తల మనోభావాలను పార్టీ అధిష్టాన వర్గానికి వినిపించి, జగ్గారెడ్డి రాకను అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. చింతా ప్రభాకర్ మొదటి నుంచీ హరీష్ రావు కు దగ్గరగా ఉంటూ, ఆయన వర్గంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదంతా నిశితంగా పరిశీలించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలర్ట్ అయ్యారు. గాంధీ భవన్ కు వెళ్లి అదే వేదికగా ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో విభేదాలు ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ వీడతారని అందరూ ఊ హించారు. కానీ జగ్గారెడ్డి సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు. పార్టీ మారడంపై టీవీ చానళ్లు, వివిధ పత్రికల్లో వార్తలు వచ్చినా గతంలో మౌనం పాటించారు.
నిన్న మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఒంటి కాలిపై లేచి ఫైర్ అయ్యారు. ఏదిఏమైనా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతాకు బీఆర్ఎస్ టికెట్ కన్ఫాం ఐనట్లేనని పార్టీ నేతలు చెపుతున్నారు. ఎట్టకేలకు జగ్గారెడ్డి ప్రకటనతో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
రేపే.. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా?
అన్ని సజావుగా ఉంటే బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ ఆపార్టీ అభ్యర్థుల జాబితా ఈనెల 21 న ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే మొదటి జాబితాలో గజ్వేల్, సిద్దిపేట, పటాన్ చెరువు, దుబ్బాక, మెదక్, నారాయణ్ ఖేడ్ లో సిటింగ్ లకు సీఎం కేసీఆర్, హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి రెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు మొదటి జాబితాలో అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ మొదటి జాబితా వెలువరించక పోతే సిటింగ్ లను చాలా చోట్ల మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో ఉమ్మడి జిల్లాలో సిటింగ్ లకు పార్టీలో, బయట వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది.