545 కోట్లతో.. మూసీపై 14 బ్రిడ్జిల నిర్మాణం: మంత్రి కేటీఆర్‌

  • By: krs    latest    Sep 26, 2023 1:02 AM IST
545 కోట్లతో.. మూసీపై 14 బ్రిడ్జిల నిర్మాణం: మంత్రి కేటీఆర్‌

విధాత, మూసీ-ఈసీ నదిపై 545కోట్లతో 14బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫుతుల్లాగూడ-ఫిర్జాదీగూడ బ్రిడ్జికి సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి పేరుతెచ్చిన మూసీ నదిని గ‌త ప్ర‌భుత్వాల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందన్నారు.


తమ ప్రభుత్వం మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగిస్తుందని, అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు పెరిగినా వెనుకడుగు వేసేది లేదని, శాశ్వతంగా, దీర్ఘ‌కాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేప‌డుతామ‌న్నారు. 160 కిలోమీట‌ర్ల ఓఆర్ఆర్ చుట్టూ తిర‌గ‌కుండా మ‌ధ్య‌లో మూసీ న‌ది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు.. రూ. 5 వేల కోట్ల‌తో రెండో విడుత ఎస్ఎన్‌డీపీ తొంద‌ర‌లోనే చేప‌డుతామన్నారు. 


2000 మిలియ‌న్ లీట‌ర్స్ ఫ‌ర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, దుర్గం చెరువు వ‌ద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించామన్నారు. ఎస్టీపీలు పూర్త‌యితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వ‌దిలే ప‌రిస్థితి వస్తుందన్నారు. మంచిరేవుల-ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు మూసీ న‌దిని అద్భుతంగా సుంద‌రీక‌రించాల‌న్న సీఎం కేసీఆర్‌ క‌ల‌ను నెర‌వేరుస్తామన్నారు..


ఒక్కొక్క‌టిగా సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు పూర్తి చేసి బ్రిడ్జిలు క‌డుతున్నామని, జీవో 118లోని చిన్న చిన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.