తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
విధాత, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన సీఐఐ తెలంగాణ స్టేట్ అన్యూవల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి రాయితీలు, ప్రొత్సహాకాలు అందిస్తుందన్నారు.
పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని, దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతుల కల్పనకు మంచి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్ ఇచ్చామని పేర్కోన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థలు మానవనరులను హైదరాబాదులో అద్భుతంగా తీర్చిదిద్దుతు ప్రపంచానికి అందిస్తున్నాయని తెలిపారు. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలకు కావలసినంత భూమి తెలంగాణలో అందుబాటులో ఉందని, హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతున్నామని గుర్తు చేశారు.
పారిశ్రామిక క్లస్టర్లు…శాటిలైట్ టౌన్ షిప్ల నిర్మాణాలు
ఔటర్ రింగు రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ల మధ్యన అనేక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నామని, హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకే చోట ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసి 3000 ఎకరాల్లో అనేక చోట్ల ఫార్మా విలేజ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన టెక్స్టైల్, గ్రానైట్, ఐటి సెక్టార్, మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
పెరిగిన ధరలతో హైదరాబాదులో సామాన్యులు పేద మధ్యతరగతి ప్రజలు ఇంటి స్థలం కొనే పరిస్థితి లేదని, గత ప్రభుత్వాలు హైదరాబాదులోని బర్కత్ పుర, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయబోతున్నదని ప్రకటించారు.
గోదావరి కృష్ణ నదులను మూసీకి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీరు పారే విధంగా మూసీ ప్రక్షాళన చేయబోతున్నామన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ తదితర వసతులు బీవోపీ మోడల్ లో అభివృద్ధి చేయనున్నామన్నారు. మూసీ రివర్ నిర్లక్ష్యం కావడం వల్ల డ్రైనేజీగా మార్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ అనుబంధ రంగాలలో పెట్టుబడులు రావాలి
అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొక్కజొన్న, టమాట, మిర్చి, పత్తి తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగానికి మధ్యన చాలా గ్యాప్ ఉన్నందున డెయిరీ రంగం విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛమైన పాలను అందించగలిగే విధంగా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలు చేసిన వారం అవుతామన్నారు. వాణిజ్య పంటల ఉత్పత్తి ద్వారా రైతులు ఆర్థికంగా బలపడటంతో పాటు పరిశ్రమల యజమానులు సైతం ఆదాయం పొందవచ్చని వివరించారు.