అధిక డిపాజిట్లు చేసే ఖాతాల సమాచారం ఇవ్వండీ
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, లెక్కకు మించిన నగదు అకౌంట్ ల సమాచారాన్ని ప్రతి రోజు ఉదయం10 గంటల వరకు ఎన్నికల నోడల్ ఆఫీసర్కు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ బ్యాంకర్లను ఆదేశించారు

- బ్యాంకులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
విధాత, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, లెక్కకు మించిన నగదు అకౌంట్ ల సమాచారాన్ని ప్రతి రోజు ఉదయం10 గంటల వరకు ఎన్నికల నోడల్ ఆఫీసర్కు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం లో అన్ని బ్యాంకు మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో రోనాల్డ్ రోస్
మాట్లాడుతూ యు.పి.ఐ (గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే) ల ద్వారా ఎక్కువ అకౌంట్ లకు నగదు ట్రాన్సఫర్ అయ్యే అకౌంట్ వివరాలు అందిచాలన్నారు. ఏ.టి.ఎం లలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జి.పి.ఎస్ ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదు కు తప్పనిసరిగా డాక్యుమెంట్ లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నగదుకు సంబంధించి రిసిప్ట్ లను తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
ఎలాంటి సమస్య లేని నగదును వెంటనే రిలీజ్ చేస్తున్నాం
డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… నగరంలో పట్టుబడుతున్న నగదును పరిశీలించి ఎటువంటి సమస్య లేనప్పుడు వాటిని వేగవంతంగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. నవంబర్ 13వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోటీలో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థుల అకౌంట్ నెంబర్లను సంబంధిత బ్యాంకులకు అందించడం ద్వారా వారి లావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థి, అభ్యర్థి సంబంధీకుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలన్నారు.
రాజకీయ పార్టీలు ఒక లక్ష కు మించిన నగదు లావాదేవీల పై సమాచారం అందించాలన్నారు. అన్ని బ్యాంకులు అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయిన అకౌంట్ లు, రాజకీయ పార్టీల అకౌంట్ లపై సమచారాన్నిఅందించాలన్నారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, ఐ.టీ అధికారులు మనీష, ఆర్.బి.ఐ మేనేజర్, హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనజర్లు పాల్గొన్నారు.