UPA Case | హరగోపాల్‌, మరో 152 మందిపై ‘ఉపా’ కేసును ఎత్తివేయండి: రేవంత్‌రెడ్డి

UPA Case లేదంటే తాము అధికారంలోకి రాగానే కేసులు ఎత్తేస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విధాత: ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు 152 మంది పైన అక్రమంగా నమోదు చేసిన ఉపా కేసులు ఎత్తేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మీరు కేసులు ఎత్తివేస్తే మంచిది.. లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ […]

  • Publish Date - June 16, 2023 / 12:31 AM IST

UPA Case

  • లేదంటే తాము అధికారంలోకి రాగానే కేసులు ఎత్తేస్తాం
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

విధాత: ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు 152 మంది పైన అక్రమంగా నమోదు చేసిన ఉపా కేసులు ఎత్తేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మీరు కేసులు ఎత్తివేస్తే మంచిది.. లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తామని ప్రకటించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొ. హరగోపాల్ తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్ల లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తోందన్నారు.

ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని అన్నారు. ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాదీ అని అన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసరని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడన్నారు.

నక్సలైట్ ఎజెండా నే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్ల కు సహకరిస్తే దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య అని రేవంత్‌ అన్నారు.

ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే నక్సలైట్ల ఏజండానే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా? అని రేవంత్‌ ప్రశ్నించారు. నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా కేసులు పెడతారా? అని అడిగారు.

తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్‌కు అండగా ఉండాలని రేవంత్‌ కోరారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రజాస్వామిక పౌర సంఘాలను బీఆర్ఎస్, బీజేపీలు ఇలా పాశవికంగా అణిచివేస్తున్నాయన్నారు.