గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య.. కాల్చిచంపిన సొంత ముఠా సభ్యులు

భూమి, డబ్బు పంప‌కాల్లో తేడా రావ‌డంతో ఒకే ముఠాకు చెందిన గ్యాంగ్‌స్ట‌ర్లు కాల్పుల‌కు దిగారు. ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రుపుకోవ‌డంతో గ్యాంగ్‌స్ట‌ర్ శరద్ మోహల్ మృతి

  • Publish Date - January 6, 2024 / 06:11 AM IST
  • ఎనిమిది నిందితుల‌ మంది అరెస్టు


విధాత‌: భూమి, డబ్బు పంప‌కాల్లో తేడా రావ‌డంతో ఒకే ముఠాకు చెందిన గ్యాంగ్‌స్ట‌ర్లు కాల్పుల‌కు దిగారు. ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రుపుకోవ‌డంతో గ్యాంగ్‌స్ట‌ర్ శరద్ మోహల్ 40 చ‌నిపోయాడు. మ‌హారాష్ట్ర‌లోని పుణె జిల్లా కోత్రుడ్‌లోని సుతార్‌దారా ప్రాంతంలో శుక్ర‌వారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో మోహోల్‌పై ముగ్గురు -నలుగురు వ్య‌క్తులు కాల్పులు జరిపారు. అతని ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లగా, రెండు బుల్లెట్లు కుడి భుజంలోకి వెళ్లాయ‌ని పోలీసు అధికారి తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన శ‌ర‌ద్‌ను కొత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పేర్కొన్నారు.


గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ శుక్రవారం తన సొంత గ్యాంగ్ సభ్యులే కాల్చి చంపినట్టు పోలీస్ అధికారి వెల్ల‌డించారు. నిందితులు వాహ‌నంలో పారిపోతుండ‌గా పూణె-సతారా రహదారిపై ఒక చోట ఎనిమిది మంది అనుమానితులను అరెస్టు చేశామని తెలిపారు. వారి నుంచి మూడు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.


మోహోల్‌పై హత్య, దోపిడీ వంటి అనేక కేసులు నమోదయ్యాయి. ఇక్కడి ఎరవాడ జైలులో అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త మహ్మద్ ఖతీల్ సిద్ధిఖీని హత్య చేసిన కేసులో ఇత‌డు నిందితుడిగా ఉన్నాడు. కానీ నిర్దోషిగా విడుదలయ్యాడు.


మోహోల్‌ ముఠా స‌భ్యుల మ‌ధ్య త‌లెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే అత‌డి హత్యకు దారితీసినట్టు అనుమానిస్తున్నామ‌ని అధికారి తెలిపారు. విచారణలో భాగంగా తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మోహోల్‌ను అతని సహచరులే చంపడం వల్ల ఇది గ్యాంగ్ వార్ కాదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇలాంటి సంచలనాత్మక అంశాలను ఎలా ఎదుర్కోవాలో త‌మ‌ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి గ్యాంగ్ వార్‌లో పాల్గొనడానికి ఎవరూ సాహసించడం లేదని ఆయన పేర్కొన్నారు.