Harish Rao | అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పాలనపై అబద్ధాలతో దుష్ప్రచారం చేయడంతో పాటు అచరణ సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు

బీఆరెస్తోనే తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
భవిష్యత్తు గులాబీ జెండాదే
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి టి.హరీశ్రావు
Harish Rao విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పాలనపై అబద్ధాలతో దుష్ప్రచారం చేయడంతో పాటు అచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ.హరీశ్రావు విమర్శించారు. శుకవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి శాశ్వతం కాదని, గెలుపుకు నాంది అని, ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. ఓడిపోయిన భువనగిరి నియోజకవర్గం పార్టీ సమావేశంలోవ పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నమన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందన్నారు. రైతుబంధు పడడం లేదని జడ్పీ చైర్మన్గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా గెలిచి భువనగిరికి ఏమి చేయలేకపోయారని, నిజంగా ఆయనకు నల్గొండపై ప్రేమ ఉంటే కృష్ణానది సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, సాగునీళ్లు, తాగునీళ్లు రావన్నారు. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలని కోమటిరెడ్డి అనడం ఆయన సంస్కారాన్ని చాటుతుందన్నారు.
బీజేపీ బీఆరెస్ ఒక్కటేనంటూ దుష్ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్-బీజేపీలు మధ్య సంబంధం ఉందని, రెండు పార్టీలు ఒక్కటనేని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందన్నారు. అదే నిజమైతే ఆ ఎన్నికల్లో బండి సంజయ్, రఘనందన్ రావు, ఈటల రాజేందర్ల ను బీఆరెస్ ఎందుకు ఓడిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లెబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆరెస్ ప్రభుత్వమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ కాగితం మాత్రమే ఇచ్చి వారి ఘనత ప్రచారం చేసుకుంటుందన్నారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చిన మాట మేరకు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో రేవంత్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీశారు.వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదని, 2వేల ఫింఛన్ను కూడా సమయానికి ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్ వంటి అన్ని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని, కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టండని కేడర్కు పిలుపునిచ్చారు. దళిత బంధుకు మంజూరైన నిధులను ప్రభుత్వం బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందన్నారు.
భవిష్యత్తు మనదే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసపూరిత హామీలిచ్చి గెలిచిందని, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇవ్వలేక ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని, రానున్న అన్ని ఎన్నికల్లో మళ్లీ ప్రజలు బీఆరెస్ను ఆదరించడం ఖాయమని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆరెస్ పార్టీనే అని, కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని, బీఆరెస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందన్నారు. కర్నాటక కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారన్నారు. ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్కు అదే గతి పడుతుందన్నారు.
మనం భయపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మనదేనన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదామన్నారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమేనని, బీఆరెస్ ఒక్కటే తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, కొల్పుల అమరేందర్, జడల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.