Revanth Reddy: ఎలక్ట్రిక్ వాహనాల రాజధాని హైదరాబాద్.. దేశంలోనే అత్యధిక అమ్మకాలు ఇక్కడే

విధాత: బయో ఏషియా.. హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) అన్నారు. మంగళవారం హైదరాబాద్లో బయో ఏషియా-2025ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్కేర్, లైఫ్ సైన్స్ మరియు బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయని, ముందు నుంచీ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మేం ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజినీర్ల సమూహాన్నీ తయారు చేయడంతో పాటు జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగాతో సాగుతున్నామన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామని, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, AI సిటీ తో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.
ఇప్పుడు దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించిందని, దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయని స్పష్టం చేశారు.అలాగే ఆర్టీసీలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. కోర్ సిటీ వెలుపల అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను సైతం అభివృద్ధి చేస్తామని, ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా, చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని, తెలంగాణలో ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఈ రెండు రింగ్లను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామని, ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్ కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగు పరుస్తామన్నారు. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామని, ఆవిష్కరణలు, పరిశోధన మరియు అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామని తెలిపారు.
ఇటీవలే హైదరాబాద్లో ఆమ్జెన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించింది. అందుకు మా సహకారమే నిదర్శనమని, తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా వెళ్లడించారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందని చెప్పారు. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో, తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, దీంతో విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయన్నారు. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామని, దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయని తెలిపారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని, ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని మేము ఆశిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ మేరకు అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం సైతం చేశాయని ప్రకటించారు. ఇప్పటికే.. జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్ మరియు జన్యు చికిత్సను ప్రారంభించిందని, ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామన్నారు.
గత 25 సంవత్సరాలలో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్గా పేరు నిలుపుకుందని, గత ఏడాది AI హెల్త్కేర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించామన్నారు. దేశవిదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖులు.. గొప్ప మనసున్న వారందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.