ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకున్నదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
(విధాత ప్రత్యేకం)
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకున్నదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు వాటిని ఉసిగొల్పుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పాత చట్టాల్లో మార్పులు చేస్తూ వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించే బిల్లును ఆరు రోజుల కిందట రాజ్యసభ మూజువాణి ఓటుతో, నిన్న లోక్ సభ ఆమోదించాయి. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనున్నది. ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వం నియమించేది. తాజా బిల్లు ప్రకారం సెర్చ్, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి.
ఈసీపై విమర్శలు
భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎన్నికల నిర్వహణ అన్నది ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుందనే పేరున్నది. అలాంటి ఈసీపై కూడా ఉన్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టడం లో విఫలమైందని,అధికారపార్టీలకు అనుకూలంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి. ఇలాంటి విమర్శలు ఉండగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)పై వివాదం నెలకొన్నది.
రాజ్యసభలో ఈ బిల్లు సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవంటూ 1991 నాటి చట్టం సథానంలో కేంద్రం ఈ బిల్లు తెచ్చిందన్నారు. ప్రస్తుత చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందన్నారు. ఈ బిల్లులో మూడు, నాలుగు అంశాలు చాలా ముఖ్యమైనవి. బిల్లులో చేర్చిన క్లాజ్ 15 (ఏ) ఉద్యోగ భద్రతకు సంబంధించింది. ఇది సీఈసీ, ఈసీలు తాము ఉద్యోగంలో ఉండగా ఏదైనా కేసులో ఎదుర్కొంటుంటే వారిలో కోర్టులో వారిపై ఎలాంటి విచారణ జరగకుండా ఉండటానికి సంబంధించిందని’ అన్నారు. కానీ కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును విపక్షాలు తప్పపట్టాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని విపక్షాలు మండిపడ్డాయి. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టగానే టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, ఆప్, జేఎంఎం వాకౌట్ చేశాయి. ఆ తర్వాత చర్చలో పాల్గొన్నాయి. ‘ఎన్నికల నిర్వహణలో స్వతంత్రత, కార్యానిర్వహక వ్యవస్థ జోక్యంతో ఎన్నికల సంఘం ప్రేరేపితం అవుతుందని మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలను, రాజ్యాంగ సభలో చర్చించిన అంశాలపై కేంద్రం ఒకసారి దృష్టి సారించి ఉంటే ఈ బిల్లు వాపస్ తీసుకునేది లేదా ఈ బిల్లే రూపొందించేది కాదని’ చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సూర్జేవాల్ అన్నారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తాజా బిల్లులో ఏమున్నది?
సుప్రీంకోర్టు తీర్పుమేరకే ఈ బిల్లు తెచ్చామంటున్న కేంద్రం వాదన నిజమేనా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2023 మార్చిలో కీలక తీర్పు వెల్లడించింది. సీబీఐ డైరెక్టర్ ఎలా నియామకం అవుతారో ఆ పద్ధతి ప్రకారం చేపట్టాలని తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం నియామకాలు ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ( సీజేఐ ) సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ ప్రతిపక్ష సభ్యుడు లేకుంటే విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని పేర్కొన్నది. ఈ త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఈసీల నియామకం రాష్ట్రపతి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల అప్పటివరకు ఉన్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీరి నియామకం కోసం పార్లమెంటు చట్టం తెచ్చే వరకు త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల తొలిగింపు సీఈసీల తొలిగింపు వలె ఉంటుందని సుప్రీం పేర్కొన్నది. అప్పుడు కేంద్రం రాజ్యసభలోఈ బిల్లు ప్రవేశపెట్టింది. కోర్టు సూచించిన ఒక నిబంధనను కేంద్రం పాటించలేదు. కోర్టు చెప్పిన ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సూచించగా సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన ఒక కేంద్ర మంత్రి ఉంటారని తెలిపింది. అప్పుడు సీఈసీ, ఈసీల హోదా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి నుంచి క్యాబినెట్ కార్యదర్శి హోదాకు తగ్గించింది. ఈ బిల్లుకు కొన్ని సవరణలు చేసి కేంద్రం తాజాగా తెచ్చిన బిల్లులోనూ ఎంపిక కమిటీలో సీజేఐకి స్థానం కల్పించలేదు. దీనివల్ల వల్ల ఏం జరుగుతుందంటే ఎన్నికల కమిషనర్గా ఎవరినైనా నియమించాలంటే తాను ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని విపక్ష నేత వ్యతిరేకించినా ప్రధాని, మరోకేంద్ర మంత్రి ఉంటారు కాబట్టి మెజారిటీ నిర్ణయం మేరకు ఆమోద ముద్ర వేస్తారనే ఆపవాదు ఉంటుంది.
కమిషన్ స్వతంత్రతపై అనుమానాలు
ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల వంటివి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు ఓటర్లైన ప్రజలు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వాల పనితీరును సమీక్షించుకుని వారు తమ తీర్పును వెలువరిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికలు సామాజిక విప్లవ సాధనాలుగా అభివర్ణించారు. అవి నిష్పాక్షింగా జరగాలి. అప్పుడే ప్రజలకు మేలు వాళ్లుపాలకులు అవుతారు. ఇంతటి కీలక పాత్ర పోషించే బాధ్యత ఎన్నికల సంఘానిది. ఓటర్ల జాబితాను సక్రమంగా నిర్వహించడం, శాసన, లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన, పకడ్బందీగా నిర్వహించడం, ఫలితాలు , పార్టీలు పాటించాల్సిన నిబంధనల రూపకల్పన, వాటిని పార్టీలు విధిగా పాటించేలా చూడటం వంటి ముఖ్యమైన విధులను ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. రాజ్యాంగం నిర్వచించిన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మొదట ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి. అలాంటి కమిషన్ చుట్టూ తాజాగా తెచ్చిన బిల్లును కేంద్రం తనకు నచ్చినట్టు తీసుకువచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఎంపిక కమిటీని నిర్వీర్యం చేసిందని, ప్రధాని, ఆయన నియమించిన సభ్యులే ఇందులో ఉంటారని ఎన్నికల కమిషన్ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.