Coronavirus | కరోనా మహమ్మారి.. రెండేండ్ల క్రితం ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. తెలియని ఒక భయం.. ఆందోళన మనల్ని ఆవహించేవి. భయంకరమైన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కోట్లాది మందిని నిరాశ్రయులను చేసింది. అంతటి భయంకరమైన ఈ మహమ్మారి భారత్ను అతలాకుతలం చేసింది.
అయితే గత కొద్ది రోజుల నుంచి వెయ్యికి దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రెండేండ్ల తర్వాత ఇవాళ అత్యల్ప కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 547 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020, ఏప్రిల్ తర్వాత తొలిసారి ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. 2020, ఏప్రిల్ 8వ తేదీన 540 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది.
దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 9,496 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 98.79 శాతం ఉండగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. కాగా కరోనా మృతుల సంఖ్య 5,30,532కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.80 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.