విధాత బ్యూరో, కరీంనగర్: దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని అర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికులను, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు విస్మరించాయని నిజామాబాద్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన ఆన్లైన్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
జీతేగా ఇండియా, బనేగా భారత్ నినాదంతో, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న ‘భారత్ జోడో అభియాన్’ పౌర సంఘాల వేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి సామాజిక ఉద్యమకారిణి కే కవిత, వలస కార్మిక నేతలు పరికిపండ్ల స్వదేశ్, మంద భీమ్ రెడ్డి అనుసంధానకర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల కాలవ్యవధిలోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమం దిశగా ప్రయత్నాలు ఆరంభించిందన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా గల్ఫ్ మృతులకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సేవలను గల్ఫ్ దేశాలతో సహా, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరిస్తామని, విదేశాల నుంచి తిరిగి వచ్చే కార్మికుల పునరావాసం గురించి శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గల్ఫ్ ప్రవాసుల పిల్లలకు విద్యాసంస్థల ప్రవేశాలలో కొన్ని సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లోని కార్మికుల కోసం సమగ్ర ప్రవాసి విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్, బహరేన్, సింగపూర్, మలేషియా దేశాలలోని తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన జీవన్ రెడ్డి తెలంగాణ శాసనమండలిలో తమ గొంతు బలంగా వినిపిస్తున్నారని, ఆయన నిజామాబాద్ లోకసభ అభ్యర్థిగా గెలుపొంది తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళగలరన్న ఆశాభావాన్ని సమావేశంలో పాల్గొన్న ప్రవాసీలు వ్యక్తం చేశారు.