నియామకాలపై నీలినీడలు.. ఆవిరవుతున్నఅభ్యర్థుల ఆశలు

- ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కమిషన్ను ప్రక్షాళన చేయాలన్న విపక్షాలు, విద్యార్థి సంఘాలు
- ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం ఎదురుదాడి
- పరీక్ష వాయిదా వేయాలన్న విజ్ఞప్తులను పట్టించుకోలేదు
- ఆగమాగం పరీక్షల నిర్వహణ
- పదే పదే అవే తప్పులు పునరావృతం
- కమిషన్ లోపాలను ఎత్తి చూపుతున్న హైకోర్టు తీర్పు
- బాధ్యత లేని వ్యవస్థలు.. జవాబుదారీతనం లేని వ్యక్తులు నిర్లక్ష్య ఫలితం
విధాత, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’. నీళ్ళు, నిధుల విషయం పక్కపెడితే… నియామకాల విషయంలో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి విమర్శల పాలవుతున్నది. ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతంలో అభాసుపాలయ్యింది. అయినా మేలుకోకుండా ప్రశ్నించిన విపక్షాలపై ఎదురుదాడి చేసింది. నియామకాల భర్తీ ప్రక్రియలో ఇప్పటికే అనేక సార్లు కోర్టు ఆయా నియామక సంస్థల పనితీరు పై అసహనం వ్యక్తం చేసింది. అయినా వాటి తీరు మారడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే నోటిఫికేషన్ల లో, పరీక్ష నిర్వహణ లో అనేక లోపాలు తలెత్తుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రెండు సార్లు రద్దు కావడం సర్వీస్ కమిషన్ పనితీరు కు నిదర్శనం అని, విపక్ష నేతలు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు ధ్వజమెత్తు తున్నారు. సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
11 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్.. అభ్యర్థుల ఆశలు ఆవిరి
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్-1 ప్రకటన వచ్చింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్-1 ప్రకటన ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. సివిల్స్, గ్రూప్-1 అన్నది నిరుద్యోగులకు ఒక కల. దీంతో ఇంతపెద్ద మొత్తంలో పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో చేరి, సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షకు 2,85, 916 మంది హాజరయ్యారు.
వీరిలో నుంచి 1:50 నిష్ఫత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్కు ఎంపిక చేసింది. జూన్లో మెయిన్స్ నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈసారి ఇంటర్వ్యూలు కూడా లేకపోవడంతో తమ లక్ష్య సాధనకు ఒక్క అడుగు దూరంలో ఉన్నామని వేలాదిమంది చాలా కష్టపడ్డారు. అనుహ్యంగా సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం గ్రూప్-1 తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలు రద్దు చేసింది.
హైకోర్టు తీర్పు
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీటులు జారీ చేశారని, ఈ పరీక్ష రద్దు చేయాలని బి. ప్రశాంత్, మరో ఇద్దరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి గ్రూప్-1 ప్రిలిమ్స్ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. పరీక్ష తిరిగి నిర్వహించాలని ఆదేశించింది.
బయోమెట్రిక్ నమోదు చేయడానికి అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందు చేరుకోవాన్న నిబంధన నోటిఫికేషన్లో ఉన్నది. తాను పేర్కొన్న నిబంధనను కమిషన్ అమలు చేయాలి. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షల్లో దీన్ని అమలు చేశారు. ఈ ఏడాది జూన్ 11న వాటిని విస్మరించారు.
ఈ కేసు విచారణ సమయంలో సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లోని మొదటి నివేదిక ప్రకారం పరీక్షకు హాజరైన సంఖ్య 2,33,248గా ఉండగా, జూన్ 28 నాటి వెబ్ నోట్ ప్రకారం వారి సంఖ్యను 2, 33, 506గా పేర్కొన్నారు. జూన్ 12న దాఖలు చేసిన కౌంటర్లో 2,33,248 సూచించారు. దీన్నిబట్టి పరీక్ష నిర్వహణలో, అభ్యర్థుల హాజరు వివరాలను నమోదు చేయడంలో కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమౌతున్నది.
బాధ్యతలేని వ్యవస్థలు, జవాబుదారీతనం లేని వ్యక్తులు
ఒకసారి పరీక్ష రద్దైన తర్వాత రెండోసారి పకడ్బందీగా నిర్వహించాల్సింది. ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో అనేకమందిపై కేసులు నమోదయ్యాయి. సర్వీస్ కమిషనలో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి. అప్పుడే సర్వీస్ కమిషన్ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకే విపక్షాలు, నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయాలని అప్పటివరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే మేలుకొని నిరుద్యోగుల ఆవేదనను అర్థంచేసుకుని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ ఆనాడు మంత్రి కేటీఆర్ ఒకరిద్దరు చేసిన పనికి మొత్తం వ్యవస్థను నిందిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? దీనికి బాధ్యత ఎవరిది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో మలుపు తిరుగుతుండటంతో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. కానీ సీఎం అసెంబ్లీ వేదికగా ఇప్పటికే సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నదని, ఈ సమయంలో రద్దు చేయడం కుదరదరి కరాఖండిగా చెప్పారు. అయితే పరీక్ష రద్దు చేయడానికి హైకోర్టు తీర్పు సారాంశాన్ని ప్రభుత్వ పెద్దలు చూస్తే అర్థమౌతుంది. తొలిసారితో పోలిస్తే రెండోసారి ఏకంగా 52 వేల మంది పరీక్ష రాయలేదు. ఒకే పరీక్ష రెండుసార్లు రద్దు అయిన తర్వాత నిరుద్యోగుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? వారి ఆవేదన ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
ప్రాణాలు ఫణంగా పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, చదువుకుని, మంచి ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్న వారి కల చెదిరిపోతున్నది. కన్నీళ్లే మిగులుతున్నాయి. రెండేళ్లపైగా పైగా ప్రిపరేషన్ చేస్తూ.. ఆర్థికంగా కుంగిపోయిన వారి బాధ ప్రభుత్వానికి అర్థమౌతుందా? పరీక్షలు రద్దవుతుంటే.. నిరుద్యోగులు పట్టుదలతో ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగించడం సాధ్యం కాదు. నియమాక స్ఫూర్తిగా విరుద్ధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. నిర్ణీత సమయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పరీక్ష నిర్వహిస్తే ప్రతిభావంతులు వస్తారు. బాధ్యతలేని వ్యవస్థలు, జవాబుదారీతనం లేని వ్యక్తుల వల్ల చాలామంది మెరిట్ అభ్యర్థులు ప్రిపరేషన్ను వదిలిపెట్టే దుస్థితి దాపురించింది.

మార్పు వస్తేనే పూర్వవైభవం
గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోసారి రద్దు కావడం దురదృష్టకరం. కమిషన్ చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోకపోవడం వల్లనే ఇది పునరావృతమౌతున్నది. సర్వీస్ కమిషన్లో సరైన సాంకేతిక బృందం , సబ్జెక్ట్ నిపుణులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి కారణం దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నది. ఆర్థికశాస్త్రం నిర్వచనం ప్రకారం మార్పు జరిగితేనే అభివృద్ది. అందుకే సర్వీస్ కమిషన్ ముందుగా పేపర్ రూపకల్పనలో సరైన నిబంధనలు పాటించాలి. అందులో ప్రధానంగా 25 శాతం సులభంగా, 25 శాతం కొంత కఠినంగా, 25 శాతం చాలా కఠినంగా, 25 శాతం అప్లికేషన్ పద్దతిలో రూపొందించాలి. అప్పుడే ఆ పరీక్షకు విశ్వసనీయత ఉంటుంది.

పరీక్షలు నిర్వహించే సమయంలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అమలు చేయాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల పరిపాలనా విభాగంలోకి వచ్చేవారితో ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు రావు. ఇంకో ముఖ్యమైన విషయం పరీక్షల తేదీలను ఖరారు చేసే సమయంలో ప్రతీ పరీక్షకు 3 నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు వాటికి అనుబంధంగా వచ్చే ఇతర డీఎస్సీ, గురుకుల పరీక్షలు రాకుండా చూసుకోవాలి. ఇయర్ క్యాలెండర్ను కచ్చితంగా అమలు చేయాలి. అది ఏటా అయినా ఫరవాలేదు లేదా రెండేళ్లకు ఒకసారి అయినా ఫరవాలేదు.
అలాగే రాజ్యాంగబద్ధమైన ఈ కమిషన్లో రాజకీయ జోక్యం ఉండకుండా, అలాంటి నియామకాలకు అవకాశం ఇవ్వకుంటేనే పారదర్శకత నెలకొంటుంది. ప్రస్తుతం కమిషన్ పనితీరు మెరుగుపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు, వివిధ పోటీ పరీక్షల సీనియర్ ఫ్యాకల్టీలతో ఒక రివ్యూ నిర్వహించాలి. దీనివల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రభుత్వం దృష్టి వస్తాయి. ప్రభుత్వం ఈ పనిచేస్తే కమిషన్కు పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. – డాక్టర్ అల్లాడి అంజయ్య, పోటీ పరీక్షల నిపుణులు
కమిషన్ను ప్రక్షాళన చేయాలి
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిల్సిమ్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు, పోటీ పరీక్ష నిపుణులు అందులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక సర్వీస్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అలాంటిదేమీ లేదన్నది. అప్పుడే సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని, నిరుద్యోగుల సందేహాలపై సరిగ్గా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి.
చివరికి ఆ పరీక్షతో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ 11న నిర్వహించిన సమయంలో అయినా మొదటిసారి జరిగిన లోపాలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా నిర్వహించాలి. కానీ బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండా హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు దీనిపై విచారణ చేపట్టి రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు, గురుకులాల నోఫికేషన్లలో హరిజంటల్\ వర్టికల్ అంశంపై వివాదం నడుస్తున్నది. ఇటీవలే కోర్టు గురుకుల నియామకాల్లో హరిజంటల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ విధానాన్ని అమలు చేయకపోతే త్వరలో జరగనున్న గ్రూఫ్-2, 3 పరీక్షలపై కూడా నిరుద్యోగులు హైకోర్టు కు వెళ్లే అవకాశం ఉన్నది. హరిజంటల్\ వర్టికల్ విధానంపై పక్కనున్న ఏపీ రాష్ట్రం 8 మందితో కూడా ఐఏఎస్ కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్లు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం హరిజంటల్ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు.

అందుకే అక్కడ ఇలాంటి వివాదాలు తలెత్తడం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి సమీక్ష, కమిటీలు ఏర్పాటు చేయలేదు. కోర్టు ఆదేశించినా దీనిపై సమగ్ర విధానాన్ని రూపొందించలేదు. సర్వీస్ కమిషన్ వ్యవహారం వల్ల ఇటు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కానీ ఏళ్ల తరబడి లక్షలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పనిచేయడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కమిషన్ను ప్రక్షాళన చేయాలి. లేకపోతే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి. ఫలితంగా నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది. -ప్రభాకర్ చౌటి, పోటీ పరీక్షల నిపుణులు