Karimnagar
విధాత: 20 కోట్లు పెట్టి ఈటల రాజేందర్ని చంపేస్తా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తున్నారంటే అది కేసీఆర్ అండతోనేనని ఈటల రాజేందర్ భార్య జమున అన్నారు. ప్రజలు కళ్లు తెరవాలని, ఇలాంటి సీఎం ఉంటే మనకు రక్షణ ఉండదని చెప్పారు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మహిళలందరం కలిసి ఇంటికి పంపిద్దామని పిలుపునిచ్చారు.
తమ ప్రాణాలకు ఏదైనా జరిగితే కేసీఆర్దే బాధ్యతని చెప్పారు. ‘కేసీఆర్ గారూ.. మా ఇంట్లో.. నా భర్త, పిల్లలు ఎవరి రక్తం బొట్టు పడినా మీదే బాధ్యత’ అని హెచ్చరించారు. మంగళవారం శామీర్పేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతో అయినా కేసీఆర్ను ఓడించడం సాధ్యమేనని అన్నారు.
ఈటల ఏ పార్టీలో ఉన్నా.. సంతృప్తిగా ఉన్నారని, ఆయన ప్రజల కోసం పని చేస్తారని తెలిపారు. ఈటల ప్రతిష్ఠ దిగజారిందని, మెప్పు కోసం మాట్లాడబోతున్నారని వాట్సాప్లో పెట్టే పోస్టులతో ఆయన ప్రతిష్ఠ దిగజారదని ఆమె స్పష్టం చేశారు. ఈటల ఉద్యమ కారుడన్న జమున.. ప్రజలే తమని కాపాడుకుంటారని చెప్పారు. తాము లంగ దొంగ పనులు చెయ్యలేదని అన్నారు.
ప్రజల్లో ఉన్నామని, ప్రజల మెప్పు పొందామని స్పష్టం చేశారు. చిల్లర, పిచ్చికుక్కను ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ మీదకు కేసీఆర్ వదిలిపెట్టారని జమున ఆరోపించారు. ‘మహిళలను కించ పరుస్తారు. మరి ఈ పిచ్చి మాటలు కేసీఆర్ నేర్పించారా?’ అని నిలదీశారు. ఎన్ని మాట్లాడితే అన్ని ఎక్కువ పదవులు వస్తున్నాయా? గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు.
2014లో కట్టిన అమరవీరుల స్థూపంపై కౌశిక్ రెడ్డి పేరులేదని దాన్ని కూల్చివేశారని జమున ఆరోపించారు. అసలు కౌశిక్రెడ్డికి అమరవీరుల స్తూపం తాకే అర్హత లేదని చెప్పారు. తమపై అక్కసుతోనే కేసీఆర్ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉండే అర్హత ఆయనకు లేదని, వెంటనే ఆయన్ను కేసీఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, పరోక్షంగా ఉండి.. ఈటలకు అండగా ఉంటానని తెలిపారు.