ట్విట్టర్లో సిద్దరామయ్య వర్సెస్ కేటీఆర్
కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎన్నికల హామీలపై అశక్తత వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడినట్లుగా వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రీపోస్టు చేస్తూ

విధాత : కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎన్నికల హామీలపై అశక్తత వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడినట్లుగా వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్పై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్కు ఘాటుగా సిద్దరామయ్య బదులిచారు. ఫేక్ వీడియోలతో కేటీఆర్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోంటే మీరు వాటిని ప్రచారం చేస్తున్నారని, బీజేపీకి మీ పార్టీ బీ టీంగా పనిచేస్తోందని ఎదురుదాడి చేశారు.
ఎన్నికలకు ముందు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫేక్ లెటర్ను వైరల్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల హామీలకు డబ్బుల్లేవన్నట్లు తన ఫేక్ వీడియోపై 2 రోజుల క్రితమే వివరణ ఇచ్చానని, మీకు ఫేక్ వీడియోకు అసలు వీడియోకు తేడా తెలియదని చురకలేశారు. తెలంగాణ ఎన్నికలల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా..?! ఏది ఫేక్, ఏది ఎడిట్, ఏది నిజమో మీకు తెలియక బీజేపీ సృష్టించిన నకిలీ, ఎడిట్ చేసిన వీడియోల మీరు సర్క్యులేట్ చేసి, నిజాలు తెలుసుకోనందుకే తెలంగాణలో మీరు ఓడారు’’ అని కర్నాటక సీఎం సిద్దరామయ్య ఎద్దేవ చేశారు. అంతకుముందు కేటీఆర్ సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’’ అని మాట్లాడిన వీడియో ఆధారంగా ట్వీట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలను తప్పుబట్టారు. కాంగ్రెస్ తప్పుడు హామీలివ్వడంతోనే మేం ఓడామంటూ పేర్కోన్నారు. దానికి సిద్దరామయ్య కౌంటర్ చేశారు.
కేటీఆర్పై కాంగ్రెస్ సోషల్ మీడియా ఆగ్రహం
కేటీఆర్పై ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. ‘‘కేటీఆర్ బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే ప్రవళిక గ్రూప్స్కు దరఖాస్తే చేయలేదని ఫేక్ స్టేట్ మెంట్ ఇచ్చారని, కర్నాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ ఫాక్స్కాన్ను తరలించుకుపోతున్నారని ఫేక్ లెటర్ ను ఎక్స్లో పెట్టాడు. ఇప్పుడు కర్నాటక సీఎం సిద్ధ రామయ్య పేరుతో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని, ఫేక్ ప్రచారాలే మీ బతుకుతెరువని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఫాంహౌస్లో కూర్చోబెట్టారని, ఇంకా మీరు మారరా’’ అని కేటీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.