సమన్వయ లోపమే బీఆరెస్ ను దెబ్బతీసింది

పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు

  • Publish Date - January 22, 2024 / 10:49 AM IST
  • పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్
  • సోషల్‌ మీడియాలో అభూతకల్పనలు, అబద్ధాల దుష్ర్పచారం
  • నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌


హైదరాబాద్‌: పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆపార్టీ నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.


ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్‌ అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్‌ వాళ్ళు ఉలికి పడుతున్నారన్నారు.


కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని.. అయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు.


కరెంటు బిల్లులు కోమటిరెడ్డికే పంపండి..


బీఆరెస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి వీడాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని కోరారు. కోమటి రెడ్డి గత నవంబర్‌లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారన్నారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపించాలన్నారు.


సాగర్‌ ఆయకట్టుకు కాంగ్రెస్‌ పాలనలో మొదటి సారి క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని విమర్శించారు. కృష్ణా రివర్‌ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్‌ కేంద్రం చేతిలో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాం సాగర్‌ చివరి ఆయకట్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండబెడుతోందన్నారు.


రేవంత్‌ భుజం మీద తుపాకీ పెట్టి..


కాంగ్రెస్‌, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందని కేటీఆర్ ఆరోపించారు. ‘రేవంత్‌ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్‌ఎస్‌ను కాలుస్తారట’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్‌-బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు.


అదానీని రాహుల్‌ దొంగ అన్నారని.. రేవంత్‌ దొర అంటున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లు కూడా కలగన లేదు… అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారని విమర్శలు చేశారు. కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయి అని అన్నారు.


వెల్లువలా సానుభూతి


కార్యకర్తలే పార్టీకి కథానాయకులు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందన్నారు. చివరిగా నల్లగొండ రివ్యూ చేస్తున్నామని, గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు.


నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదు కానీ, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయన్నారు. సూర్యాపేటలో మాత్రమే గెలిచామని.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.


ఈ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనని కేటీఆర్‌ తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలన్నారు.


కాంగ్రెస్‌ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి.. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దామని కేటీటీర్‌ పిలుపునిచ్చారు. కాగా జనవరి 3 ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు నల్లగొండతో ముగిశాయి.