విధాత: అయోధ్యలో భారత్ లోనే అత్యంత అద్భుతమైన రామాలయం మరో 17 రోజుల్లో ప్రారంభోత్సవం కానుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి అయోధ్యకు శ్రీవారి లక్ష లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తుండగా, భారత్ లోనే ఈఆలయం అత్యంత అద్భుతమైన రామాలయం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేర వేయనున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
3 నుంచి తిరుమలలో సదస్సు
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దేశ నలుమూలల నుంచి ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరవుతారని అన్నారు. మరోవైపు శ్రీవారి భక్తులు నకిలీ వెబ్ సైట్ల కారణంగా మోసపోవద్దని సూచించారు. అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని ఈవో సూచించారు.