డైనోసార్‌ గుడ్లు అని తెలియక.. కులదైవాలని రాళ్ల బంతులకు పూజలు..

త‌ర‌త‌రాలుగా త‌మ‌ పూర్వీకులు పూజిస్తూ వ‌చ్చిన వ‌స్తువులు ఎలాంటివో.. ఎందుకు ఇచ్చారో తెలియ‌క‌పోయినా భ‌క్తితో పూజ‌లు ఇచ్చిన వాటిని పూజిస్తూ ఉంటారు

డైనోసార్‌ గుడ్లు అని తెలియక.. కులదైవాలని రాళ్ల బంతులకు పూజలు..

విధాత‌: త‌ర‌త‌రాలుగా త‌మ‌ పూర్వీకులు పూజిస్తూ వ‌చ్చిన వ‌స్తువులు ఎలాంటివో.. ఎందుకు ఇచ్చారో తెలియ‌క‌పోయినా భ‌క్తితో పూజ‌లు ఇచ్చిన వాటిని పూజిస్తూ ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పోక‌డ చాలా చోట్ల క‌నిపిస్తుంది. భార‌త్‌లోనూ వింతగా పాటించే ఆచారాల‌ను, విగ్ర‌హాల గురించి అడిగినా.. ఏమో త‌ర‌త‌రాలుగా త‌మ కుటుంబం ఇలానే చేస్తోంది అని చెబుతారు. అవి ఏంటో తెలిసేవ‌ర‌కు ఆ మిస్ట‌రీ అలానే కొన‌సాగుతుంది.


తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (Madhya Pradesh) లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేస్తోంది. కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి ఓ కుటుంబం కొన్ని రాళ్ల బంతుల ఆకారంలో ఉన్న వాటిని కుల‌దేవ‌తగా పిలుచుకుంటూ పూజిస్తోంది. అవేంట‌నే విష‌యం వారికీ తెలియదు. కాగా తాజాగా వాటిని ప‌రిశీలించిన శాస్త్రవేత్త‌లు.. . వాటిని ల‌క్ష‌ల ఏళ్ల వ‌య‌సున్న డైనోసార్ల గుడ్ల‌ (Dinosaur Eggs) ని తేల్చారు. ఇది విని నిర్ఘాంత‌పోవ‌డం ఆ కుటుంబం వంతైంది. వారు ఏ భావంతో ఈ ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఆ కుటుంబం సంర‌క్ష‌ణ వ‌ల్లే ఇన్నేళ్ల పాటు ఆ గుడ్లు ఇంత సుర‌క్షితంగా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ధార్ జిల్లా ప‌డ్లాయా గ్రామంలో ఉన్న మండోల‌య్ కుటుంబమే కుల‌దేవ‌త పేరుతో ఈ గుడ్ల‌ను ఆరాధిస్తోంది. ఇవి ఒక్కొక్క‌టి అర‌చేతిలో ప‌ట్టేంత ప‌రిమాణంలో గుండ్ర‌ని రాయిలా ఉన్నాయి. ఇలాంటివి సుమారు తొమ్మిందింటిని ఒక ప్ర‌త్యేక ఆకారంలో పెట్టి పూజిస్తున్నారు. తాము ఆ రాళ్ల బంతుల‌ను కాక‌ర్ భైర‌వ్ పేరుతో పూజిస్తున్నామ‌ని ప్ర‌స్తుతం ఆ ఇంట్లో ఉంటున్న వెస్టా మండోల‌య్ (41) చెప్పుకొచ్చారు. ఈ దేవ‌తే త‌మ పొలాల‌ను, ప‌శు సంప‌ద‌ను ర‌క్షిస్తోంద‌ని న‌మ్ముతున్నామ‌ని చెప్పారు.


వీరే కాకుండా ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలు కాక‌ర్ భైర‌వ పేరుతో ఇలాంటి గుడ్ల‌ను పూజిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దేవ‌త అని ప్ర‌చారంలో ఉన్న ఈ గుడ్ల ఫొటోలను చూసి అనుమానం వ‌చ్చిన శాస్త్రవేత్త‌లు వాటిని ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ల‌క్నో సాహ్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ విభాగం ప‌రిశోధ‌కులు ఇక్క‌డ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి దేవ‌త‌గా పూజింపబ‌డుతున్న ఈ వ‌స్తువులు డైనోసార్ గుడ్ల‌ని తేల్చారు. అవి టైట‌నోసార‌స్ అనే జాతికి చెందిన రాక్ష‌స‌బ‌ల్లుల వ‌ని క‌నుగొన్నారు.


సుమారు 7 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఈ టైట‌నోసార‌స్‌లు భూమి మీద మ‌నుగ‌డ సాగించాయ‌ని ఒక అంచ‌నా. ఇవి ఈ భూమ్మీద జీవించిన అతి పెద్ద రాక్ష‌స‌బ‌ల్లుల్లో ఒక‌టి. మ‌న దేశంలో మ‌ధ్య ప్ర‌దేశ్ చుట్టుప‌క్క‌ల న‌ర్మ‌దా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇవి విరివిగా సంచ‌రించిన‌ట్లు ఆధారాలున్నాయి. 1877లో తొలిసారి ఈ విష‌యాన్ని క‌నుగొన‌గా.. తాజాగా ఈ ఏడాది మొద‌ట్లో వాటికి సంబంధించిన 250 గుడ్ల‌ను శాస్త్రవేత్త‌లు న‌ర్మ‌దా న‌దీ లోయ‌ల్లో క‌నుగొన్నారు.