మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు మహా శివరాత్రిని ప్రపంచమంతా హిందువులు అత్యంత నియమ నిష్టలతో జరుపుకొంటారు
Maha Shivaratri | మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు మహా శివరాత్రిని ప్రపంచమంతా హిందువులు అత్యంత నియమ నిష్టలతో జరుపుకొంటారు. మహా శివరాత్రి అంటే శివునికి ఎంతో ఇష్టమైన రోజు. దృక్ పంచాంగం ప్రకారం ఇది మాఘ మాసం కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. చాంద్రమాన హిందూ క్యాలెండర్లో ప్రతి నెలా శివరాత్రి వస్తుంది.
అయితే, మహా శివరాత్రి ఏటా ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో శీతాకాలం ముగింపు, వసంతకాలం, ఎండాకాలం ఆరంభంలో ఈ పండుగ ఉంటుంది. ప్రేమ, శక్తి ఏకత్వ స్వరూపం.. శివుడు, శక్తి కలయికకు గుర్తుగా ఈ పండుగను జరుపుకొంటారు. హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. పరమశివుడు పురుషుడైతే.. పార్వతీమాత ప్రకృతి స్వరూం. ఈ చైతన్యం, శక్తి కలయికే సృష్టిని ప్రోత్సహిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారదోలేందుకు మహాశివరాత్రి దోహదపడుతుంది.
శివుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం..
మహా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివుడిని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ముంచెత్తుతారు. శివనామస్మరణ చేస్తూ శివుడికి దగ్గరగా (ఉపవాసం) ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. రాత్రి వేళల్లో జాగరణ దీక్షలతో స్వామిని కొలుస్తారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైంది.
మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య చేసే రుద్రాభిషేకం, శివ బిల్వార్చన అష్టయిశ్వర్యాలను కలిగిస్తుందని నమ్ముతారు. అనేక ఇతిహాసాలు ఈ పవిత్రమైన రోజుకు సంబంధించిన అనేక విషయాలను బోధించాయి. ఈ రాత్రే సృష్టి జరిగిందని వివరించాయి. మహా శివరాత్రి పర్వదినం రోజునే శివపార్వతుల కల్యాణం జరిగినట్లు పేర్కొన్నాయి.
బ్రహ్మకు, మొగలిపువ్వుకు శాపం..
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడు. తన ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెప్పగామ హావిష్ణువు శ్వేతవరాహ రూపంలో మూలం కనుక్కునేందుకు కిందివైపు వెళ్తాడు. అదే సమయంలో బ్రహ్మ శివలింగం పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగ ఆది అంతాలను కనుక్కోలేక పోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతకీ పుష్పం, గోవు పై నుంచి వస్తూ కనిపిస్తాయి. తాను శివలింగం ఆది కనుక్కున్నట్లు శివుడు, విష్ణువుల ముందు చెప్పాల్సిందిగా మొగలిపువ్వును, గోవును బ్రహ్మ కోరుతాడు.
దీంతో గోవు, మొగలిపువ్వు బ్రహ్మ చెప్పినట్లుగానే శివుడి వద్ద చెబుతారు. వారు అబద్ధం చెబుతున్నారని గ్రహించిన శివయ్య మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. అబద్ధం చెప్పించినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి, పూజలు ఉండవని శాపమిస్తాడు. మొగలి పువ్వు పూజకు పనికిరానిదిగా శపిస్తాడు. ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్ధం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోకని చూస్తే పాపపరిహారంగా శివుడు శపిస్తాడు. కాగా, మహావిష్ణువు సత్యం చెప్పడం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షాన్నిచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం లింగోద్భవ కాలంలోనే జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉంది. ఇక బ్రహ్మ కూడా శివుడిని లింగరూపంలోనే ఉంటావని శపించడం మూలంగా అప్పటి నుంచి ఈశ్వరుడు లింగరూపకంలోనే పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తున్నది.