బిల్వపత్రం.. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి.
Maha Sivaratri | బిల్వపత్రం.. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన శివుడికి ఒక్క బిల్వ పత్రమైనా సమర్పించాలని భక్తులు కోరుకుంటారు. మరి బిల్వ పత్రం శివుడికి ఎందుకంత ప్రీతికరమైందో తెలుసుకుందాం..!
ఈ ఏడాది మార్చి 8న శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం. ఆ రోజున మహాదేవుడిని విశేష పూజలతో కొలుస్తారు. అర్చనలు, అభిషేకాలు చేస్తారు. పూజల్లో గోగుపూలు, మారేడు, బిల్వ దళాలను సమర్పిస్తారు. వీటన్నింటిలో బిల్వపత్రం చాలా శ్రేష్టమైంది. శివుడికి ఎంతో ప్రీతికరమైంది. శివభక్తులు ఏడాదంతా మహాశివరాత్రి కోసం వేచి చూస్తుంటారు. ఈ రోజున శివుడి కల్యాణోత్సవాన్ని కనుల పండువలా జరుపుకొంటారు. శివ పురాణం ప్రకారం సృష్టి ఈ రోజు నుంచే మొదలైంది. బ్రహ్మ, విష్ణువులతో సహా ఈ రోజునే ఒక అగ్ని లింగం నుంచి సృష్టి ప్రారంభమైందని శివ పురాణం చెబుతున్నది. శివరాత్రి రోజు శివ లింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఎన్నో రకాల పద్ధతుల్లో శివపూజ చేస్తారు. వాటిలో ఒకటి శివలింగం పై బిల్వపత్రాన్ని ఉంచి చేసే పూజ. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. శివలింగంపై బిల్వపత్రాలను ఉంచి పూజ చేస్తే తప్పక శివానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఏకంగా శివారాధన కోసం బిల్వాష్టకమే ఉంది. శివ పూజలో బిల్వ పత్రానికి అంత ప్రాశస్త్యం ఉంది.
బిల్వ పత్రాలతో ప్రసన్నం చేసుకున్న పార్వతీమాత..
పర్వత రాజు కూతురు పార్వతిదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. మహాధ్యానంలో ఉన్న శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్వతి శివుడి కోసం తప్పస్సు చేసింది. ఎన్నో ఉపవాసాలు, ఎన్నో పూజలు చేసింది. ఓ సారి బిల్వ వృక్షం కింద శివుడు తప్పస్సు చేస్తున్నప్పుడు పార్వతి శివ పూజకు అవసరమయ్యే పూజ సామగ్రిని తేవడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలనే పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చి చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
బిల్వపత్ర పూజతో ప్రయోజనాలు
మహా శివరాత్రి నాడు బిల్వ పత్రాలను సమర్పించిన భక్తులకు ఆర్థిక కష్టాలు తీరుతాయి. అన్ని రకాలుగా సమృద్ధి కలుగుతుంది. అందుకే చాలామంది మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా బిల్వార్చన చేస్తారు. దంపతులు ఈ రోజున బిల్వ పత్రాలతో శివపూజ చేస్తే వారి దాంపత్య జీవితం అనందమయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్ముతారు. శివరాత్రి రోజు శివలింగాన్ని తేనెతో అభిషేకం చేస్తే చేసే ఉద్యోగంలో సమస్యలు తొలిగిపోతాయని, జీవితంలో ఒడిదొడుకులు దూరమవుతాయని చెబుతారు. శివరాత్రి రోజున శివ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం సదా ఉంటుంది. శివలింగాన్ని పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరుతాయి. చెరుకురసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. సంపద కలిగి దారిద్య్రం తొలగిపోతుంది.