Medak
విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి పటాన్చెరు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి ని గెలిపించాలని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎవరికి దక్కుతుందో లేదో అన్న సందిగ్ధం నెలకొన్న తరుణంలో సాక్షాత్తు సీఎం కేసీఆర్ పటాన్చెరు ఎమ్మెల్యేను తిరిగి గెలిపించాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఈసారి చాలావరకు మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొదటిసారిగా బహిరంగ సభలో పటాన్చెరు ఎమ్మెల్యేను తిరిగి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా ఇదే నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు టికెట్ ఆశిస్తూ అధిష్టానం దృష్టిలో పడేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు విచ్చేసిన సీఎం కేసీఆర్ ఇన్ డైరెక్ట్ గా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కే టికెట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ నియోజకవర్గము నుండి కొందరు నేతల ఆశలకు గండి పడినట్లేనని భావిస్తున్నారు.