దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కలసి రావలసిన అవసరం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
విధాత బ్యూరో, కరీంనగర్: దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కలసి రావలసిన అవసరం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
గురువారం ఉదయం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో డిసిసి అధ్యక్షుడు, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్ తో ముచ్చటించారు.
దేశాన్ని కాపాడడానికి ఆలోచన చేయాలని,దేహంతో పాటు దేశాన్ని కాపాడాలని ఆయన వాకర్స్ కు విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లభిస్తుందన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో వాటన్నిటిని అధిగమించటానికి కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు.
తాను ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటినుండి ఎస్ ఆర్ ఆర్ కళాశాల మంచి చెడులు చూసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2009-2014 మధ్య వాకర్స్ కి వేసిన ట్రాక్, ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ తప్ప తరువాత జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మహిళల కోసం టాయిలెట్స్, తిరిగి ట్రాక్ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఓపెన్ జిమ్ మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వార్మప్ కు ఒక ప్లాట్ ఫారం కావాలని వాకర్స్ అడిగారని చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. వాకర్స్ సానుకూల దృక్పథంతో లోకసభ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.