పదవులు ఎవరికి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అధికారంలో మనం ఎంత అభివృద్ధి చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

  • By: Somu    latest    Dec 23, 2023 11:36 AM IST
పదవులు ఎవరికి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
  • అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం
  • బీఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా అభివృద్ధి
  • అదే తరహా పాలనను కాంగ్రెస్ కొనసాగించాలని ఆశిస్తున్నా
  • సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి


విధాత, సూర్యాపేట: పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అధికారంలో మనం ఎంత అభివృద్ధి చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


పశువైద్య, ఉద్యానవన, నీటి పారుదల, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, ప్రాథమిక విద్య, పౌర సరఫరా, ఆరోగ్య, రోడ్లు, రహదారులతో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో జరిగిన, జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్షించారు.


ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో, బీఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో అధికారులే సాక్షమని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని అన్నారు. మీరు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్తు తరాలకు చిహ్నంగా నిలబడాలని సూచించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు.


బీఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. అదే తరహా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో జరగాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అభివృద్ధి కొనసాగించేందుకు పూర్తిగా మద్దతు తెలుపుతామని, అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధమని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేపడితే తమకు పోరాటాలు కొత్తేమీ కాదని, తన 8వ తరగతి నుండి పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేసుకున్నారు.


అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి భాగస్వామ్యం కావాలని సర్పంచులకు సూచించారు. కేసీఆర్ ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధితో పనిచేశారో సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంపీపీ నెమ్మాది బిక్షం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, వైస్ ఎంపీపీ సింగా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.