విధాత, నల్గొండ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయని, ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీది అమలుకు సాధ్యం కానీ మేనిఫెస్టో అని చెప్పామని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే, బీఆర్ఎస్ ను రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సబబు కాదన్నారు.
బీఆర్ఎస్ ను రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి ఉద్దేశంలా ఉందని ఆరోపించారు. తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందనీ, వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పరిపాలన గొప్పతనంపై ప్రజల్లో చర్చ మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు.
పథకాల అమలుకు ప్రభుత్వంగా సమయం తీసుకుంటే తప్పులేదు కానీ, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు. తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయని అన్నారు. అధికారంలోకి వచ్చేది ఉందా? సచ్చేది ఉందా? అన్న రీతిలో ఎవరో రాసిచ్చిన హామీలను చదివి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ అయోమయంలోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారనీ అన్నారు.
కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది
ఇప్పటికే కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని అటకెక్కించిందన్నారు. ప్రజల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. పైగా బిల్లు చెల్లించకపోతే వచ్చేనెల రెట్టింపు అవుతుంది అన్న రీతిలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిపాలన చేతకాకపోతే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.