విధాత: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను బీఆరెస్ వదలబోదని, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవనలో ఎమ్మెల్యేలు కేపి వివేకానందరెడ్డి, కోవా లక్ష్మితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ పిటిషన్ సోమవారం విచారణకు రానుందన్నారు.
అలాగే ప్రజాక్షేత్రంలోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తమ పోరాటం కొనసాగుతుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని.. చావు డప్పులు కొడుతామని, అసెంబ్లీ ఎదుట ధర్నాలు చేస్తామని తెలిపారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు సిగ్గు, శరం, లజ్జ ఉంటే కేసీఆర్ పెట్టిన భిక్షయైన ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలని, వారు మగోళ్లయితే రాజీనామా చేసి మళ్లీ గెలువాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
కనీసం మేం ఫిర్యాదు చేయడానికి కూడా స్పీకర్ సమయం ఇవ్వలేదని, దీంతో రిజిస్టర్ పోస్టులో అనర్హత పిటిషన్లు పంపామని తెలిపారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేస్తామని రాహుల్గాంధీ జాతీయ మ్యానిఫెస్టోలో చెబుతుంటే రేవంత్రెడ్డి ఇక్కడ దానికి గోతులు తవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్రెడ్డి తన మాట మేరకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని కోరారు. రేపంత్ రెడ్డి అభద్రతా భావంతో కొడంగల్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తు బెదిరిస్తున్నాడన్నారు.
ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ 26 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని మంతి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే వారి లిస్టులో నా పేరు చేర్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఆదివాసీ బిడ్డనని. కేసీఆర్ తో పాటే బీఆరెస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కే.పి.వివేకానందరెడ్డి మాట్లాడుతూ గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని రేవంత్రెడ్డి అన్నారని, ఎవరిని కొట్టాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి నా? అంటు మండిపడ్డారు.