MLA Rajaiah | తీవ్ర ఉద్వేగానికి లోనైన డాక్టర్ భారీగా తరలివచ్చిన అనుచరులు కేసీఆర్ మాట దాటలేదు: రాజయ్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎం కేసీఆర్ మాటదాటలేదని, ఆయన పై తనకు విశ్వాసం ఉందంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తికొండ రాజయ్య ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కని స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య బోరున ఏడ్చారు. బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆ పార్టీ […]
MLA Rajaiah |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎం కేసీఆర్ మాటదాటలేదని, ఆయన పై తనకు విశ్వాసం ఉందంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తికొండ రాజయ్య ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కని స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య బోరున ఏడ్చారు. బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థులను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
సిటింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ టికెట్ లభించని రాజయ్య తొలిసారి తన నియోజకవర్గమైన స్టేషన్ ఘన్ పూర్ లో కార్యకర్తల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘‘కార్యకర్తలందరకీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఘన్ పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే దేవుళ్ళని భావించి పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చాను.
స్థానిక నినాదం మీద నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండాలని భావించాను. అవసరమైతే నా ప్రాణమైనా అర్పించేందుకు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ను ఒప్పించి టీఆర్ఎస్ అభ్యర్ధి విజయరామారావుకు టికెట్ వచ్చినపుడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా టికెట్ త్యాగం చేసినా. 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ను నేను పల్లెత్తు మాట అనలేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను.
అధికార పార్టీలో ఉంటూ 2011లో కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టి టీఆర్ఎస్ లో చేరాను. తెలంగాణ జెండా పట్టుకుని రాష్ర్టమంతా ఉద్యమంలో తిరిగాను. 15 సంవత్సరాల సీనియారిటీ కాంగ్రెస్ లో ఉన్నాకూడా కేసీఆర్ వెంట నడిచాను.
రెండవ సారి ఆ రకంగా త్యాగం చేశాను. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పోయినా మూడోసారి త్యాగం చేసి మాట మీద నిలబడ్డాను. 2018లో అదే చిత్తశుద్ధితో పనిచేశాను. ఇప్పటి వరకు అంకితభావంతో ఉన్నా’’ అని రాజయ్య చెప్పారు. తనకు కేసీఆర్ పై విశ్వాసం ఉందని ప్రకటించారు.
బోరున ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య
ఎమ్మెల్యేను కలిసేందుకు రాజయ్య అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు కలిసివచ్చిన రాజయ్య తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. వారిని చూసి బోరున ఏడ్చారు. ఆయనకు మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ, జై తెలంగాణ, దళితుల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్దపెట్టున నినదించారు.
ఈ సందర్భంగా రాజయ్యతో పాటు ఆయన అనుచరులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కొందరు నాయకులు ఆవేశంతో ఊగిపోయారు. మహిళా కార్యకర్తలు, వృద్ద మహిళలు వచ్చి ఆయనను పట్టుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సమయంలో రాజయ్య సైతం ఉద్వేగానికి లోనయ్యారు.
అనంతరం రాజయ్య కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పదవీ త్యాగం, తెలంగాణ కోసం తాను కట్టుబడి ఉన్న తీరు. తన రాజకీయ లక్ష్యం..ప్రకటించారు. తానెప్పుడూ కేసీఆర్ మాట తీసేయ్యలేదని, ఇప్పటి వరకు పల్లెత్తుమాటనలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలు మార్లు కన్నీటిపర్యంతమయ్యారు. గద్గద స్వరంతో అనుచరులనుద్దేశించి మాట్లాడారు.