విధాత: హాథ్ సే హాథ్ జోడో యాత్ర పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రతో ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలంగాణ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ను విశ్వసిస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు.
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో అయితే ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేర్చేందుకు ఇక్కడ కేసీఆర్ లాంటి నియంతను, ప్రజా కంటకుణ్ణి గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో హంగ్ రాదు.. రాబోయే ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కూడా ఎవరితో పొత్తు పెట్టుకోదని ఆ అవసరం ఎప్పటికీ రాదని బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఉందని ఆమన స్పష్టం చేశారు. కార్యకర్తలు గందరగోళంలో పడే విధంగా సీనియర్ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు.