గడిచిన సంవత్సరంలో ఒక్క హైదరాబాద్లోనే మద్యం తాగి వాహనాలు నడిపినందుకు లక్ష మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు
2023లో 5,032 మందికి జైలు
4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్లను
సస్పెండ్ చేసిన ఆర్టీఏ అధికారులు
విధాత: గడిచిన సంవత్సరంలో ఒక్క హైదరాబాద్లోనే మద్యం తాగి వాహనాలు నడిపినందుకు లక్ష మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 5,032 మందికి జైలు శిక్ష పడింది. తాజాగా డిసెంబర్ 31వ రాత్రి ఒక్కరోజే రాష్ట్ర పోలీసులు దాదాపు ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసు బృందాలు నిత్యం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అనేక గణాంకాల్లో వెల్లడైంది. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడకుండా ఉండటానికి నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నారు.
గత ఏడాది కేవలం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే పోలీసులు 1.06 లక్షల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు మొత్తం 5,032 మందికి కోర్టులు జైలుశిక్ష విధించాయి. దాదాపు 4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ అధికారులు సస్పెండ్ చేశారు.
2023లో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు
హైదరాబాద్ – 37,866
సైబరాబాద్ – 52,124
రాచకొండ – 16,594
డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్ -556
సైబరాబాద్ – 500
రాచకొండ – 2,900
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష
హైదరాబాద్ – 3,782
సైబరాబాద్ – 979
రాచకొండ – 271.