Jangaon | ఆగమేఘాల మీద అక్కడికి ముత్తిరెడ్డి ఇటీవల జడ్పీ చైర్మన్ ఆడియో లీక్ అంతా అధిష్టానం కనుసన్నల్లోనేనా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీటుకు వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి ఎసరొస్తుందా? అంటే ఔననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాపకింద నీరులా ముత్తిరెడ్డి సీటు పైన ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్, సీఎం కేసీఆర్ కు సన్నిహితునిగా ఇటీవల బాగా […]
Jangaon |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీటుకు వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి ఎసరొస్తుందా? అంటే ఔననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాపకింద నీరులా ముత్తిరెడ్డి సీటు పైన ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్, సీఎం కేసీఆర్ కు సన్నిహితునిగా ఇటీవల బాగా గుర్తింపు పొందిన పల్లా కన్నేశారనే చర్చకు తాజా పరిణామాలు నిజమని చెబుతున్నాయి.
ఎమ్మెల్యేకు తెలియకుండానే జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులతో బుధవారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం కావడం గమనార్హం. తన నియోజక వర్గానికి చెందిన నాయకులతో పల్లా సమావేశమయ్యారనే సమాచారం తెలిసి హుటాహుటిన ముత్తిరెడ్డి అక్కడికి చేరుకోవడం విశేషం. పల్లాతో సమావేశమైన నాయకులు ముత్తిరెడ్డిని చూసి కాసింత షాక్ కు లోనయ్యారు.
అయినప్పటికీ ఈ దఫా ముత్తిరెడ్డికి పోటి చేసే అవకాశం ఇవ్వకూడదని చెప్పడంతో ఎమ్మెల్యే అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. రెండు సార్లు జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్తిరెడ్డి మూడవ పర్యాయం పోటీచేసేందుకు సమాయత్తమవుతున్న సమయంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఆయనకు పోటీగా రావడం ఆ పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది.
తాజా పరిణామాలు సీఎం కేసీఆర్, బీ ఆర్ ఎస్ అధిష్టానం అనుమతితో జరుగుతున్నాయా? లేక ఎమ్మెల్యే సీటు మీద ఆశతో జనగామ అసంతృప్తివాదులను పోగేస్తున్నారా? అనే చర్చ పార్టీలో సాగుతోంది. తాను మాత్రం సీఎం కేసీఆర్ మనిషినంటూ తనకు సీఎం పైన నమ్మకం ఉందని ముత్తిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీ చైర్మన్ పాగాల ఆడియో కలకలం
జనగామ జడ్పీ చైర్మన్ గా ఉన్న పాగాల సంపత్ రెడ్డి ఇటీవల ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా జడ్పీటీసీలను కూడగట్టే ప్రయత్నం చేసిన విషయం బహిర్గతమైంది. జడ్పీ చైర్మన్ ఫోన్ లో మరో జడ్పీటీసీతో మాట్లాడుతూ ఈ సారి జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్ధతు తెలియజేద్దామంటూ ఆ ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ఆడియా రికార్డు బహిర్గతమైంది.
ఈ ఆడియో జనగామలో కలకలం సృష్టించింది. దీని పై పల్లా నోరు మెదపలేదు. జడ్పీ చైర్మన్ మాత్రం తాను ముత్తిరెడ్డిని వ్యతిరేకించలేదని, పల్లాకు మద్ధతు తెలియజేద్దామన్నట్లు సమర్ధించుకునే యత్నం చేశారు. ఇది జరిగిన తర్వాత జడ్పీచైర్మన్ ను ముత్తిరెడ్డి వర్గం దూరం పెడుతూ వచ్చింది.
ఈ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న సందర్భంలో ముత్తిరెడ్డికి అసమ్మతి నాయకులను హైదరాబాద్ పిలిపించి మరీ సమావేశం కావడం ఇప్పుడు గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నుంచి పొగబెట్టే కార్యక్రమం చూసి ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
టూరిజం ప్లాజాలో హైడ్రామా
జనగాం బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు రాజధానికి చేరాయి.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న
నేతలు ప్రగతి భవన్కు అతి సమీపంలోని టూరిజం ప్లాజాలో భేటీ.ఈ నేతలంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉండగా విషయం తెలిసి… pic.twitter.com/OghRpqOJmK
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2023