Mahabubnagar | ముఖ్య నేతల కప్పదాట్లు బీఆరెస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎంపీపీ కాంగ్రెస్ ను వీడిన కొల్లాపూర్ పీసీసీ సభ్యుడు అభిలాష్ రావు పాలమూరు బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి అడ్వకేట్ వెంకటేష్ ఏ పార్టీలో ఎవరుంటారో, పోతారో.. ఎన్నికల వరకు అధినేతల భయం పాలమూరులో రసవత్తరం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయం […]
Mahabubnagar |
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకూ పార్టీల నేతలు రంగులు మారుస్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదరడంలేదు.
అసమ్మతి పెరగడం, కొత్త నేతలు పార్టీ లోకి రావడం నచ్చక పోవడం వంటి కారణాలతో పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తాము ఉన్న పార్టీ లను వీడుతున్నారు. పాలమూరు కు చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎన్ పీ వెంకటేష్ పార్టీ ని వీడి టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పాలమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో ఇక్కడ మహాకూటమి అభ్యర్థి కి టికెట్ లభించడంతో భంగ పడిన ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చురుకైనా నేతగా పేరుపొందారు.
ఇక్కడ ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సంఘటన ను ఊహించని బీజేపీ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నియోజకవర్గంలో బీజేపీ కి పెద్దగా పట్టులేదని గ్రహించిన వెంకటేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొల్లాపూర్ లో కాంగ్రెస్ కు దెబ్బ
కొల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దెబ్బ తగిలింది. పీసీసీ సభ్యుడు అభిలాష్ రావు పార్టీ ని వీడారు. కొన్నేళ్లుగా పార్టీ ని నమ్ముకున్న ఆయన ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు.
జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం తో అభిలాష్ రావు ఆశ లు గల్లంతు అయ్యాయి. ముందుగా జూపల్లి రాకను ఆహ్వానించిన ఆయనను ఇటీవల జరిగిన సంఘటనలు బాధించాయని చాలా సందర్భాల్లో అభిలాష్ రావు వెల్లడించారు. జూపల్లి ఏర్పాటు చేసిన సమావేశాలకు పిలవడం లేదని, మా వర్గ నేతలను పట్టించుకోవడం లేదని, అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాని ఆయన ప్రకటించారు.
కొల్లాపూర్ నియోజకవర్గం లో జూపల్లి కి వ్యతిరేకంగా పనిచేస్తానని, అందుకే త్వరలో బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అభిలాష్ రావు వెల్లడిస్తున్నారు.ఇప్పటికే తన రాజీనామా లేఖ ను టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి పంపారు.
కొడంగల్ నియోజకవర్గం లో బీఆరెస్ ఖాళీ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీపీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరారు. టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి బరి లో ఉండడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి కొడంగల్ కు రావడంతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తి గా మారిపోయాయి.
ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. ఇదివరకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు మంచి పట్టు లభించింది. మళ్లీ ఈ మధ్య కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశముక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈయన ఈ ప్రాంతంలో పట్టున్న నేతగా బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరడంతో మరింత ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరగడంతో ఆ పార్టీ అధిష్టానం ఈ జిల్లాపై దృష్టి పెట్టింది.
ఇంకా ముఖ్య నేతలను పార్టీ లో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. దేవరకద్ర నియోజకవర్గం కాకుండా మక్తల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని ఆమె కండీషన్ పెట్టారు. ఎన్నికల వరకు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో రానున్న రోజుల్లో ఆయా పార్టీ ల్లో చేరికలు ముమ్మరంగా ఉంటాయని అన్ని పార్టీ ల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.