Ponguleti Effect బీఆర్ఎస్ నేతలు నూకల నరేష్ రెడ్డి, రంగారెడ్డి ఇంటికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వారిద్దరితో సమావేశం మానుకోట జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ నూ' కల' నెరవేరేనా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులుగా ప్రత్యేక గుర్తింపు పొంది, తెలంగాణ ఉద్యమ ఆరంభం నుండి పనిచేసినా, ఇప్పటివరకు ఏ పదవి రాని ముఖ్య నాయకులుగా నూకల నరేష్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి మనకు కనిపిస్తారు. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఈ […]
Ponguleti Effect
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులుగా ప్రత్యేక గుర్తింపు పొంది, తెలంగాణ ఉద్యమ ఆరంభం నుండి పనిచేసినా, ఇప్పటివరకు ఏ పదవి రాని ముఖ్య నాయకులుగా నూకల నరేష్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి మనకు కనిపిస్తారు. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరి నాయకులను శుక్రవారం రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్లి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మానుకోట పర్యటన సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా వారితో మాట్లాడడం ఆసక్తి రేకెత్తిస్తుంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కాలిడుతున్న ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నాయకులతో కేటీఆర్ మంతనాలు జరపడం గమనార్హం. పొంగులేటికి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డికి ఇటీవల దగ్గర బంధుత్వం నెలకొంది.
నరేష్ రెడ్డి, రంగారెడ్డిలు సురేందర్ రెడ్డికి సమీప బంధువులు కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. పొంగులేటి కాంగ్రెస్లోకి వెళుతున్న నేపథ్యంలో నూకల నరేష్ రెడ్డి కూడా అటువైపు మొగ్గుచూపుతారని ప్రచారం సాగుతోంది. దీనికి తోడు తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన ఎలాంటి గుర్తింపు దక్కలేదని చర్చ కూడా ఉంది.
రెడ్డి సామాజికవర్గానికి చెందిన పొంగులేటి పార్టీ మార్పు, ఖమ్మం తోపాటు మహబూబాబాద్ జిల్లా రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ లో నూకల శ్రీరంగారెడ్డితో మాట్లాడారు. పురుషోత్తమాయగూడెం కు స్వయంగా వెళ్ళి నరేష్ రెడ్డితో మాట్లాడడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నూకల శ్రీరంగారెడ్డిది మరిపెడ మండలం యరిజర్ల.. ఈయనకు కేటీఆర్ స్నేహితునిగా కూడా మంచిగుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేటీఆర్ శ్రీరంగారెడ్డి ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి కందికొండ జాతరకు వెళ్ళి కందికొండగుట్టను కూడా అధిరోహించారు.. ప్రస్తుతం శ్రీరంగారెడ్డి మంత్రి సత్యవతిరాథోడ్ ప్రధానఅనుచరునిగా కొనసాగుతున్నారు.
ఒక మరో నాయకుడు మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన నూకల నరేష్ రెడ్డి గురించి ఈ..ప్రాంతంలో తెలియని వారెవ్వరు ఉండరు… డోర్నకల్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా, టిడిపి తరుపున ఆయన పోటీచేశారు. టిఆర్ఎస్ లో ఉద్యమకాలం నుండి కొనసాగుతున్నారు.
అయితే కేటీఆర్ వీరిద్దరితో ఏం మాట్లాడారనేది బయటికిపొక్క లేదు. మధ్య పొంగులేటి అంశం చర్చకు వచ్చినట్లు భావిస్తున్నారు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో నూ’కల’ నెరవేరవచ్చని.. వీరిద్దరికి ఏదో ఒక నామినేటెడ్ పదవి వరించివచ్చే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు జోరుగా వినవస్తున్నాయి.
ఇప్పుడే ఇస్తారా లేకుంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. వీధి ఇద్దరితో మంత్రి కేటీఆర్ మంతనాలు జరిపినప్పుడు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి, ఎంపీ మాలోత్ కవిత తదితరులు ఉన్నారు. మానుకోట పర్యటన సందర్భంగా సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటికి కూడా కేటీఆర్ వెళ్లి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు.