విధాత : ‘కలరిజం’.. స్ట్రయిట్గా చెప్పాలంటే.. తెల్లగా ఉండేవారికి ప్రాధాన్యం ఇవ్వడం! రంగు తక్కువ ఉన్నవారిని దూరం పెట్టేయడం! ఈ కలరిజం అనేది బాలీవుడ్లో సర్వసాధారణమైపోయిందని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాస్త రంగు తక్కువ ఉంటుందని భావించే ప్రియాంక.. తన చర్మం రంగు మెరిసేలా అనేక సినిమాల్లో తెల్లగా చూపించారని, మేకప్ వేసి, ముఖం ఎదురుగా పెద్ద పెద్ద లైట్లతో కాంతి వెదజల్లేవారని బయటపెట్టారు. నటుడు, దర్శకుడు డాక్స్ షెపర్డ్ యాంకర్గా వ్యవహరిస్తున్న అర్మ్చైర్ ఎక్స్పర్ట్ పోడ్కాస్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన జీవితం, కెరీర్, తన ఆశలు, ఆకాంక్షలు ఇలా అనేక అంశాలను ఆమె పంచుకున్నారు.
తన కెరీర్ మొదటి రోజుల గురించి మాట్లాడుతూ కలరిజం (colourism) అనేది బాలీవుడ్లో ఎంత సర్వసాధారణం అయిపోయిందో, అది తన కెరీర్లో వచ్చిన కొన్ని అవకాశాలను ఎలా దెబ్బతీసిందో వివరించారు. తాను కొన్ని ఫెయిర్నెస్ క్రీములకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించానని చెబుతూ వాటిలో తన చర్మం మెరిసిపోయేలా తెల్లగా చూపించారని వెల్లడించారు.
ఆడపిల్లలకు తెల్లటి చర్మం ఉంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందనేలా వచ్చే అడ్వర్టయిజ్మెంట్లు తీవ్ర నష్టం కలిగిస్తాయని కుండబద్దలు కొట్టారు. ‘నేను సినిమా రంగంలోకి వచ్చినప్పుడు నేను తెల్లగా ఉండనని భావించేవారు. నా గురించి డస్కీ యాక్ట్రెస్ అని రాసేవారు. ఏంటీ డస్కీ అనుకునేదాన్ని.
కానీ.. నేను కూడా కమర్షియల్స్ చేశాను. ఎందుకంటే అది బ్యూటీ బ్రాండ్ కాబట్టి. బ్యూటీ బ్రాండ్స్కు చేయడం సినీ తారలకు ఎంతో ఉపయోగం. ఈబ్యూటీ బ్రాండ్లు అన్నీ ఫెయిర్నెస్ క్రీములకు సంబంధించినవే’ అని ఆమె చెప్పారు. అయితే.. ఇటువంటి వాణిజ్య ప్రకటనలు చాలా నష్టం చేస్తాయని అన్నారు. ‘నేను డార్క్ స్కిన్ అమ్మాయిని.
నేను పూలు అమ్మే దుకాణం దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి పూలు కొనుక్కొని వెళ్లిపోతాడు. నాకేసి కన్నెత్తయినా చూడడు. నేను ఒక క్రీమ్ కొనుక్కొని రాసుకుంటాను. నాకు జాబ్ వచ్చేస్తుంది. ఆ అబ్బాయి నా వాడైపోతాడు. నా కలలన్నీ నెరవేరుతాయి.. ఇదీ 2000 సంవత్సరం కాలంలో వచ్చిన కమర్షియల్స్ సారాంశం’ అని ప్రియాంక వివరించారు.
హాలీవుడ్కు ఎందుకు వచ్చానంటే..
బాలీవుడ్ను వదిలి.. హాలీవుడ్పై ఎందుకు కేంద్రీకరిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇండస్ట్రీలో (బాలీవుడ్లో) తనకు అవకాశాలు ఇవ్వకుండా ఒక మూలకు నెట్టేశారని చెప్పారు. బాలీవుడ్ రాజకీయాలతో విసుగెత్తి కూడా బ్రేక్ తీసుకుందామని భావించానని తెలిపారు