దోపిడి పాలన అంతమే ఉద్యమకారుల పంతం: ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ
సబ్బండ వర్ణాల పోరాటం,త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన కల్వకుంట్ల వారి పాలనను అంతం చేయడమే ఉద్యమకారుల పంతం కావాలని ప్రొఫెసర్ కూరపాటి అన్నారు

- కేసీఆర్ కుటుంబ నిర్ణయమే ప్రజాస్వామ్యం అయిపోయింది
- దుష్టపాలన పోవాలంటే కాంగ్రెస్ రావాలి
- కాంగ్రెస్ అదే తప్పులు చేస్తే మళ్లీ విప్లవమే
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సబ్బండ వర్ణాల పోరాటం, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, వారి పాలనను అంతం చేయడమే ఉద్యమకారుల పంతం కావాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ పుల్లూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమకారుల వేదిక కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కేసీఆర్ దుష్ట పాలనకు వ్యతరేకంగా గత రెండు సంత్సరాల నుండి పౌర సమాజం పోరాటం చేస్తున్నదని, ఆ సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమ వేదిక కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తుందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కూడ కేసీఆర్ ఎన్నో తప్పులు చేశాడని, రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులుగా అన్నీ భరించామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ నిర్ణయమే ప్రజాస్వామ్యమైందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు వారి కుల ఆధిపత్యంలో రాష్ట్రం దోపిడీకి గురైందని, అలాంటి దుష్ట పాలనను గద్దె దించడానికి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా, గతంలాగానే తప్పులు చేస్తే మరో విప్లవం పెల్లుబుకుతుందని హెచ్చరించారు. 90 శాతం ప్రజలు బీఆరెస్ను ఓడించాలని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పెట్టే ప్రలోభాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, సోమ రామమూర్తి, సాయిని నరేందర్, చింతకింది కుమారస్వామి, బనుక సిద్ధిరాజ్ యాదవ్, అకినపల్లి వెంకటేశ్వర్లు, చిల్ల రాజేంద్రప్రసాద్, యాదగిరి చారి, పటేల్ వనజ, సద్గుణ, సుమలత, కోండ్ర నర్సింగరావు, కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, నున్న అప్పారావు, ముంజాల బిక్షపతి, చాపర్తి కుమారస్వామి, మంద వీరస్వామి, తాడిషెట్టి క్రాంతి, డాక్టర్ కె వీరాస్వామి, సాంబరాజు మల్లేష్, చేపూరి ఓదెలు, సంజీవ, బొనగాని యాదగిరి గౌడ్, నలిగింటి చంద్రమౌళి, రాజ్ మహ్మద్, నల్లెల రాజయ్య, పిట్టల శ్రీను, ఆకు పవన్ తదితరులు పాల్గొన్నారు.