విధాత: మునుగోడు నియోజకవర్గంలో గుండ్రంపల్లి పంచాయతీ పరిధిలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో రగడ జరిగింది. గ్రామానికి చెందిన దళిత మహిళలు గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని లబ్ధిదారుల ఎంపికపై పంచాయతీ సెక్రెటరీతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు.
గ్రామంలో ని పేద దళిత కుటుంబాలను కాకుండా ఇప్పటికే భూములు, వాహనాలు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆరోపించారు. అసలు ప్రభుత్వాన్ని దళిత బంధు ఎవరిమ్మన్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై సర్పంచ్ను కూడా మహిళలు కడిగి పారేశారు.
ఎంతో మంది పేదలు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక, జీవన కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారు. అయినా ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కడుతున్నారు. అలాంటి వారికి కాకుండా అనర్హులను దళిత బంధుకు ఎంపిక చేసి లక్షలు కట్టబెట్టడం అన్యాయం అని దళిత మహిళలు మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మహిళలు ఎంపిక చేసిన లబ్ధిదారులే ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. అలాగైతే మేము ఇక నుంచి ప్రభుత్వానికి ఓట్లు వేయమంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అర్హులను దళితబంధుకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అనర్హులనే ఎంపిక చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.