రాజధాని పంచాయతీలో జగన్‌కు రిలీఫ్!.. హైకోర్టుకు అక్షింతలు

విధాత: అమరావతి రాజధాని వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఏపి ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ కు కాస్త రిలీఫ్ దక్కినట్లు అయింది.. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆరు నెలల్లో రాజధానిని నిర్మించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు 6 నెలల కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై […]

  • Publish Date - November 28, 2022 / 11:08 AM IST

విధాత: అమరావతి రాజధాని వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఏపి ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ కు కాస్త రిలీఫ్ దక్కినట్లు అయింది.. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆరు నెలల్లో రాజధానిని నిర్మించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు 6 నెలల కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

కాగా ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ , అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదించారు. న్యాయమూర్తులు జస్టిస్ కేవీ జోసెఫ్ బీవీ నాగరత్నంల ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ జగన్‌కు మద్దుతుగా ఉన్నాయి. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? చీఫ్ ఇంజనీరా ? అని ప్రశ్నించింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలని హైకోర్టు ఎలా చెబుతుంది?.. మీరే ప్రభుత్వమైతే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. హైకోర్టు ఆరు నెలల్లో రాజధానిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని నిలదీసింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. అయితే రాజధానిని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల పైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.