Revanth Reddy | బీఆరెస్‌కు 25 సీట్లే: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | అంతకు మించి వచ్చే అవకాశమే లేదు తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సిద్ధం నువ్వు వస్తావా? కేటీఆర్‌ వస్తారా? లిక్క‌ర్‌, నిక్క‌ర్ పార్టీలు ఏక‌మ‌య్యాయి అందుకే సభలో కాంగ్రెస్పై కేసీఆర్ దాడి గ‌ద్ద‌ర్‌కు శాసనసభలో నివాళి ఏది? సీఎంపై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి విధాత: వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీఆరెస్‌కు 25కు మించి సీట్లు రావని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్‌, కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్‌గా […]

Revanth Reddy | బీఆరెస్‌కు 25 సీట్లే: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

  • అంతకు మించి వచ్చే అవకాశమే లేదు
  • తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహంపై
  • చర్చించేందుకు కాంగ్రెస్‌ సిద్ధం
  • నువ్వు వస్తావా? కేటీఆర్‌ వస్తారా?
  • లిక్క‌ర్‌, నిక్క‌ర్ పార్టీలు ఏక‌మ‌య్యాయి
  • అందుకే సభలో కాంగ్రెస్పై కేసీఆర్ దాడి
  • గ‌ద్ద‌ర్‌కు శాసనసభలో నివాళి ఏది?
  • సీఎంపై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

విధాత: వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీఆరెస్‌కు 25కు మించి సీట్లు రావని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్‌, కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్‌గా అసెంబ్లీలో చిల్ల‌ర‌మ‌ల్ల‌ర రాజ‌కీయాలు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించ‌డంలో అసెంబ్లీ విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

కాంగ్రెస్‌ను కేసీఆర్, కేటీఆర్ అభ్యంతరకరంగా దూషించ‌డ‌మేకాక‌, తండ్రీ కొడుకులు చర్చను తన చుట్టూనే తిప్పారని విమ‌ర్శించారు. సభలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నార‌ని అన్నారు. కాంగ్రెస్‌ లేవనెత్తిన అంశాలపై, తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘నువ్వు వస్తావో, కేటీఆర్‌ను పంపుతావో.. హరీశ్‌ను పంపుతావో తేల్చుకో’ అని స‌వాల్ విసిరారు.

నువ్వే చంద్రబాబు శిష్యుడివి

టీడీపీలో తాను చంద్రబాబుకు శిష్యుడిని కాదని, సహచరుడినని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరాన‌ని గుర్తు చేసుకోవాల‌న్నారు. టీడీపీలో కేసీఆర్ ప్రస్థానం చంద్రబాబు అనుచరుడిగా మొదలైంద‌ని, నిలువ నీడ లేని కేసీఆర్‌కు టీడీపీనే ఆధారమైందన్నారు.

తెలంగాణ పట్ల త‌న‌ నిబద్ధత ఎప్పుడూ మారలేదని, తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో ముందున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించార‌ని, 1996లో 610 జీవోను, జోనల్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్ అని విమ‌ర్శించారు.

సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆరే అన్నారు

1996లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సూచించారు. సోనియా వల్లనే తెలంగాణ సాకారమైందని 13 జూన్ 2014లో శాసనసభలో కేసీఆర్ చెప్పార‌ని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారని ప్ర‌శ్నించారు. తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నది, నిలదీసింది తానేనని, చంద్రబాబు సహచరుడిగా ఉన్నా ఆనాడు తెలంగాణపై తన నిబద్ధత మారలేద‌న్న విష‌యం గుర్తుపెట్టుకోవాల‌న్నారు.

ఆనాడు గవర్నర్ పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యింది తానేనని చెప్పారు. 24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించింది, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పింది, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరులో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని చెప్పి, ఎవరికీ తలవంచకుండా తెలంగాణ కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను తానేనని రేవంత్‌రెడ్డి వివ‌రించారు.

నమ్మినవారిని మోసం చేసే చరిత్ర కేసీఆర్‌ది

నమ్మి వచ్చిన వారిని మోసం చేసిన సంగతి మరిచిపోయావా? అని కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. ‘కేసీఆర్.. నీ పార్టీ బతికిందే కాంగ్రెస్‌తో.. కాంగ్రెస్ లేకపోతే నువ్వు, నీ కుటుంబం అడుక్కు తినేవారు. 24 సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.

సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలనపై మాత్రమే విమర్శలు చేశా. కేసీఆర్ తన అవసరానికి ఒకసారి టీడీపీతో, మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న కిషన్ రెడ్డీ.. 2011లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంది నిజం కాదా? శాసన మండలి ఎన్నికల్లో ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నది నిజం కాదా?’ అని నిలదీశారు.

ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను ఇవాళ కేసీర్ అక్కున చేర్చుకున్నారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన జగన్‌ను ప్రగతి భవన్కు పిలిచి భోజనం పెట్టారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన దుర్మార్గుడు కేసీఆర్ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాలూచీలో కేసీఆర్‌ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరని వ్యాఖ్యానించారు. వీళ్లా తెలంగాణపై నా నిబద్ధత గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. ‘2014కు పూర్వం ఏం మాట్లాడినా తెలంగాణ కోసమే మాట్లాడాం.. నన్ను తెలంగాణ వ్యతిరేకి అంటే తెలంగాణ సమాజం నమ్మదు. ఏ రోటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

గద్దర్‌కు అసెంబ్లీ నివాళి ఏది?

తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్ అని, గద్దర్ 2019లో మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాల‌ని రేవంత్ ఆకాంక్షించారు. గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్‌ కొనసాగిస్తుంద‌న్నారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పార‌ని, యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని సూచంచారని తెలిపారు.

కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని గ‌ద్ద‌ర్‌ అప్పుడే చెప్పార‌ని వెల్లడించారు. ‘గద్దర్ మరణించారని ఇప్పటివరకు నేను సంయమనం పాటించాను. ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడ్డారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే విజ్ఞత ప్రదర్శించాను’ అని రేవంత్ తెలిపారు.