మోదీ, కేటీఆర్ మాటల పరమార్థం ఇదే: రేవంత్ రెడ్డి

  • Publish Date - October 5, 2023 / 12:31 PM IST
  • 9 ఏళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం
  • సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని కేసీఆర్ పొగిడారు
  • హంగ్ వస్తే టీఆర్ఎస్ కు మద్దతిస్తామని 2018లో లక్ష్మణ్ అన్నారు
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే మోదీ పర్యటనలు
  • ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి


విధాత, హైదరాబాద్: తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ఇరు పార్టీలు ఒకరికి ఒకరు అంతర్గతంగా సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రెండు రోజులుగా ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్ మాటలను నిశితంగా పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.


గురువారం అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ మంత్రినాయక్, ఉప్పునూతల జప్పీటీసీ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ అరుణ నర్సింహా రెడ్డి, అచ్చంపేట వైస్ ఎంపీపీ అమరావతి సీఎం రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ బద్రీనాథ్ యాదవ్ తదితర నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వారినుద్దేశించి ప్రసంగించారు.


గడిచిన 9 ఏళ్లలో మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కేసీఆర్ మద్దతు ఉన్నదనే విషయం పార్లమెంటు రికార్డులను తిరగేస్తే అర్థమవుతుందన్నారు. 2016లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో కేసీఆర్ మోదీని పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రగతిశీలమైనదని, రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారని చెప్పారు. దీన్ని బట్టి మోదీ, కేసీఆర్ బంధం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చన్నారు.


పెద్ద నోట్ల రద్దుపై దేశం అంతా గగ్గోలు పెడుతుంటే, కేసీఆర్ మాత్రం పూర్తిగా మద్దతు ప్రకటించారని తెలిపారు. 2018 ఆగస్టులో రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్ ఏ నాయకుడికి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేవలం బీజేపీ నేతలను మాత్రమే ప్రగతి భవన్ కు పిలుపించుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్, బీజేపీ నేతలు ప్రగతి భవన్ వేదికగా కుట్ర పన్నారని ఆరోపించారు.


2018 ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే టీఆర్ఎస్ కు మద్దతిస్తామని మీడియాతో వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనుబంధానికి లక్ష్మణ్ అప్పుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడిగా సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలని పేర్కొన్నారు.


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటు కూడా జరిగిందన్నారు. బీఆరెస్ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేసే వీలుగా సీట్ల పంపకం జరిగిందన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ వ్యూహంలో భాగమేనని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని నిజామాబాద్ సభ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారని, బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారన్నారు.


ఈ నేపథ్యంలో బీఆరెస్ కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆరెస్ లది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇస్తారు అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది.. బీజేపీతో దోస్తీ కడుతూ వారికి గెలుపు కోసం పని చేస్తున్న బీఆరెస్ వైపు నిలబడుతుందా? బీజేపీ, బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ వైపు నిలబడుతుందో స్పష్టం చేయలని డిమాండ్ చేశారు.