సిబ్బంది.. అధికారుల కృషితోనే పురోగమనం : సజ్జనార్‌

టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ కొనియాడారు

సిబ్బంది.. అధికారుల కృషితోనే పురోగమనం : సజ్జనార్‌
విధాత : టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని, ఛాలెంజ్ కు తగ్గట్టుగా పనిచేస్తూ సంస్థను ప్రగతి పథంలో ముందుకుతీసుకెలుతున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ కొనియాడారు. టీఎస్‌ ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ సంక్రాంతికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని, ఇన్సిడెంట్ ఫ్రీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అదే స్పూర్తితో, ఉత్సాహంతో రాబోయే మేడారం జాతరకు పనిచేయాలన్నారు. మహాలక్ష్మి స్కీమును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం మెచ్చుకుందని పేర్కొన్నారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.

డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని, ఈ స్కీమ్ ను ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు.

వేగంగా అందుబాటులోకి కొత్త బస్సులు


“పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సజ్జనార్‌ తెలిపారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోందన్నారు. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందని తెలిపారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్ ను చేపడుతామన్నారు.


కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌ళో వారికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేస్తారని వెల్లడించారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.

బస్‌ భవన్‌లో ప్రతి రోజూ జాతీయ గీతాలాపన


ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుభదినాన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు. దేశానికే గర్వకారణమైన జనగణమన జాతీయ గీత ప్రాముఖ్యతను భవిష్యత్‌ తరాలకు వివరించడంతో పాటు నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్ లో జాతీయ గీతాలాపన చేస్తున్నామని చెప్పారు.


దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్, ఆర్ఎం కార్యాలయాలతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం ఈ గణంతంత్ర వేడుకల్లో విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ అధికారులకు మెడల్స్‌తో సజ్జనార్‌ సత్కరించారు. సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్లు సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్ డిపో మేనేజర్లను ప్రశంసా పత్రాలతో సన్మానించారు.